‘ధరణి ఉంటేనే రైతులకు భరోసా.. మా భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి.. భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింద’న్నారు అన్నదాతలు. రైతులకు ఉపయోగపడే ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల కరెంట్.. 5 హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేసుకుంటుంటే.. 10 హెచ్పీ మోటర్లు అంటూ.. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు.. వ్యవసాయం మానేసేలా ఉన్నాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో ఎన్నో కష్టాలు పడ్డామని, మళ్లీ పాత రోజులను గుర్తు చేసేలా.. ఆ పార్టీ నాయకుల మాటలు ఉన్నాయని అన్నదాతలు మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు. రాష్ట్రం రాక ముందు కరెంట్ ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో.. తెలియని పరిస్థితి ఉండేది. వ్యవసాయానికి కరెంట్ సక్రమంగా లేక పొలాలు ఎండిపోయేవి. నాణ్యమైన కరెంట్ అందక బోర్లు కాలిపోయేవి. నాడు ప్రతి రోజు కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాలం. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న నిరంతర కరెంట్తో ఆనందంగా పంటలు పండించుకుంటున్నాం.
– పెయ్యల సురేశ్, మైసిరెడ్డిపల్లి గ్రామం, మేడ్చల్ మండలం
ధరణి వచ్చిన అనంతరం భూముల రిజిస్ట్రేషన్ సులభంగా అవుతున్నది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగానే మీ సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుని ఇచ్చిన తేదీలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్నాం. గతంలో రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్కు వెళ్లి చలాన్ కట్టి, కార్యాలయంలో వెళ్లి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందా అని ఎదురుచూసేవాళ్లం. సమయం ఉంటే ఆ రోజు లేకుంటే మరుసటి రోజు కూడా రిజిస్ట్రేషన్ అవుతుండే. దీంతో మాకు రోజంతా సమయం పోతుండే. నేడు స్లాట్ ద్వారా వచ్చిన తేదీ, సమయం ప్రకారం వెళ్లి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేస్తున్నాం.
– యాదయ్యగౌడ్, శ్రీరంగవరం గ్రామం, మేడ్చల్ మండలం
కాంగ్రెస్ మూడు గంటలే కరెంటు ఇస్తామని ప్రకటనలు చేయడం సరికాదు. రైతాంగానికి ఇచ్చే మూడు గంటల కరెంట్తో మళ్లీ పాత రోజులు వచ్చి..రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. సాగు చేసిన పొలాలు ఎండిపోవడం ఖాయం. 3 గంటల కరెంట్తో రైతులు ఏ మోటర్ వాడినా దండగే. ఇచ్చే 3 గంటల కరెంట్తో రైతులందరూ రాత్రి సమయాల్లో కాపు కాసి పారపెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో రైతులందరూ ఒకేసారి కరెంట్ ఆన్చేయడంతో ఉన్న మోటర్లు ఖాళీ పోతాయి. ట్రాన్స్ఫార్మర్ల మీద పెద్ద లోడ్ పడి ఖాళీ పోతాయి.
– యాదగిరి, రైతు అంకిరెడ్డిపల్లి
కాంగ్రెస్ పార్టీ వారు రైతులకు ఇస్తామన్న 3 గంటల కరెంట్తో అన్నదాతలు వ్యవసాయం చేయలేరు. వ్యవసాయాన్నే నమ్ముకొని బతికే రైతాంగాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంట్ అంటున్నది. రైతాంగం కోసం సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని బంగారంలా మారిస్తే.. ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగాన్ని నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ వాళ్లు నానా కుట్రలు చేస్తున్నారు. 3 గంటల కరెంట్ ఇస్తే రైతులందరూ ఆగమవుతారు. రైతులను ఆగం చేయడానికే కాంగ్రెస్ వాళ్లు కుట్రలు పన్నుతున్నారు.
– చిలుక ముత్యాలు, కీసర
ధరణి పోర్టల్ వచ్చినందువల్లే మా భూములు ఆన్లైన్లో నమోదయ్యాయి. మా భూములపై మాకు సర్వ హక్కులను ధరణి పోర్టల్ కల్పించింది. ఆన్లైన్ నమ్దైన నా భూములకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందుతున్నాను. భూములను ఇతరులు ఆక్రమించకుండా ధరణి రైతులకు మేలు చేస్తున్నది. ఈ క్రమంలో ధరణిని కాంగ్రెస్ నాయకులు ఎత్తేస్తామని చేస్తున్న ప్రకటనలు సరైందికాదు. రైతులను అయోమయానికి గురి చేయవద్దు. ధరణి పోర్టల్కే రైతుల సంపూర్ణ మద్దతు ఉంది.
– సంతోష్, బండ్లగూడ
రైతులు వ్యవసాయం మానేసేలా కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ధరణి తీసేస్తామంటూ.. రైతులను అయోమయానికి గురిచేయకండి. ధరణి పోర్టల్ ఎత్తేస్తే రైతులంతా ఆగమవుతారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరణితో మా భూములకు భద్రత ఏర్పడింది. రైతుబంధు, రైతుబీమా పథకాలను ధరణిలో నమోదైన భూముల యజమానులకు వర్తింపజేస్తున్నారు. ధరణి వల్ల ప్రతి రైతుకు న్యాయం జరిగింది. పాత రోజులు తెచ్చే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. గతంలో పహాణి నఖల్కు కార్యాలయాలు చుట్టూ తిరిగినా పనికాకపోయేది.
– మల్లేశ్, బండ్లగూడ
ధరణి లేక ముందు పట్టా చేసుకున్న భూములను మ్యుటేషన్ చేసుకోవడానికి అధికారుల చుట్టూ తిరగలేక పైరవీలు చేసుకోవాల్సి వచ్చే ది. ఇప్పుడు పట్టా చేసుకున్న వెంటనే మ్యుటేషన్ అవుతున్నది. ఆన్లైన్లోనూ పేరు వ స్తున్నది. పట్టాదారు పాసుపుస్తకాన్ని పోస్టులో పంపిస్తున్నారు. పది సంవత్సరాలకు ముందు భూమిని పట్టా చేసుకోవాలన్నా.. పట్టా చేసుకున్న భూమిని మ్యుటేషన్ చేసుకోవాలన్నా.. పట్వారీల చుట్టూ తిరిగేవాళ్లం. ధరణితో ఆ బాధ లు తప్పాయి. ధరణి తీసివేస్తే మునుపటి కష్టాలు వస్తాయి.
– రెడ్డిపల్లి వెంకటేశ్గౌడ్, రాజబొల్లారం గ్రామం, మేడ్చల్ మండలం
కాంగ్రెస్ నాయకులు మూడు గంటలే కరెంటు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. 3 గంటల కరెంటుతో రైతులు కష్టాలపాలు కావాల్సిందే. పాతబోరులోంచి ఉన్న మోటరు తీసేస్తే..పెద్దమోటరు బిగించేందుకు కుదరదు. మట్టి పడి పూడిపోయి..ఉన్న మోటరు ఇరుక్కుపోయి సామాన్లు పనికిరాకుండా పోతాయి. మళ్లీ కొత్తగా బోరు వేయాల్సిందే. 10 హెచ్పీ మోటరు బిగించాల్సిందే. మూడు గంటల కరెంట్ ఇస్తే దిగుబడి.. రాబడి ఎలా సాధిస్తారో హామీలు ఇచ్చేవారితో పాటు ఓటేసే వారు కూడా ఆలోచించాలి.
– జిన్నారపు నర్సింహ, దుండిగల్
3గంటల కరెంటు అంటే.. ఏం చేసుకోవాలె.. బోర్ల నీళ్లు లేకపోయినా 24 గంటల కరెంటు ఉన్నందున అప్పుడింత అప్పుడింత పొద్దుమాపు పారలవెట్టుకుంటున్నం. ఉన్న భూమిల కూరగాయలు, ఇంత వరి వేసుకున్నాం. ఇప్పటికైతే ఈ కరెంటుతోటి ఏ లొల్లి పంచాయితీ లేదు. కాంగ్రెస్ పాడుగాను ఎప్పుడు రైతుల మీద పడుడే. మూడు గంటల్లో పొలం పారాలంటే.. 10 హెచ్పీ మోటర్ తెచ్చుకోవాలె. 10 హెచ్పీ అంటే లక్షరూపాయల ముచ్చటనాయే. లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం ఉంటాదంటే అది కూడా ఉండదు.
– సంజీవరెడ్డి, తూంకుంట
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో రైతులంతా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ వాళ్లు కౌలుదారు విధానం తెరమీదికి తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కౌలుదారు విధానంతో పట్టా రైతులు పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత భూములున్న రైతులకు పూర్తి హక్కులు కల్పించారు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
– శీలం శేఖర్, రైతు కీసర