Minister Srinivas Yadav | సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక రంగాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు మంత్రికి బతుకమ్మలతో స్వాగతం పలికారు. సమావేశానికి ముందుగా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు విద్యుత్ పరిస్థితి, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధించిన ప్రగతిని వివరించే ప్రత్యేక డాక్యుమెంటరీని మంత్రి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోనే వివిధ రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ అందుతుందని, నాయీ బ్రాహ్మణులు, రజకులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది కృషితోనే ఇది సాధ్యమైందంటూ ప్రశంసించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అంధకారంలో ఉండాలని ఎగతాళి చేశారని, వాటిని కొట్టి పారేస్తూ అనేక వ్యయ ప్రయాసలకోర్చి విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసినట్లు వివరించారు.
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడది 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగామన్నారు. నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 5,741 మెగావాట్లకు పెంచినట్లు తెలిపారు. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచిందని, సంస్థలో నష్టాలను నివారించుకోవడం, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టడం, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యలను పెంచుకోవడం వంటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనుసరించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే విషయాన్ని పట్టించుకోలేదని, కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు.
రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయని కారణంగా వ్యవసాయానికి ఎప్పుడు కరెంట్ వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అన్నదాతలు అనేక అవస్థలు పడ్డారని వివరించారు. పరిశ్రమలకు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేక పవర్ హాలీడే ప్రకటించారని, దీంతో పరిశ్రమలలోని కార్మికులకు సరైన ఉపాధి లభించేంది కాదన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, నామన శేషుకుమారి, ఎలక్ట్రికల్ ఎస్ఈ రవి కుమార్, ఈడీలు శ్రీధర్, సుదీర్, పర్వతాలు, సుచేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.