ఎయిమ్స్ తరహాలో నగరంలో
నలువైపులా టిమ్స్ దవాఖానలు
ఆల్వాల్లో మహిళల కోసం ప్రసూతి విభాగం
సామరస్యపూరిత వాతావరణం
వల్లే నగరంలో ఏడేండ్లుగా 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రపంచానికి అవసరమైన టీకాల్లో 33 శాతం ..
హైదరాబాద్ నుంచే తయారీ
టిమ్స్ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దవాఖానలకు
కొత్తపేట, ఎర్రగడ్డ, అల్వాల్లలో భూమిపూజ
సూపర్ స్పెషాలిటీ పడకలు 5300
ప్రస్తుతం 1300.. కొత్త టిమ్స్తో 3వేలు
ఇప్పటికే గచ్చిబౌలిలో వెయ్యి పడకలు
సూపర్ స్పెషాలిటీ వైద్యమంతా ఉచితమే
ఒక్కో టిమ్స్లో 30 విభాగాలు.. 16 ఆపరేషన్ థియేటర్లు
ప్రతి పడకకూ ఆక్సిజన్ సౌకర్యం.. 300 ఐసీయూ పడకలు
నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తృత పరిచే ఆశయంతో నిర్మించ తలపెట్టిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో, ఎర్రగడ్డ ఛాతి వ్యాధుల దవాఖాన ఆవరణలో, ఆల్వాల్లోని(బొల్లారం) రాజాజి ఇన్స్టిట్యూట్ (భారతీయ విద్యాభవన్) ప్రాంగణంలో దవాఖాన నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సేవలను విస్తరించేందుకే నగరం నలువైపులా టిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 3 చోట్ల జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, మహమూద్ అలీ, హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్, యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్త, వాణిదేవి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, శంభీపూర్ రాజు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, పరిశ్రమల కార్పొరేషన్ ఛైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మైనంపల్లి హన్మంతరావు, సాయన్న, వివేకానంద్, అరెకపూడి గాంధీ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, కాలేరు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ వైద్యంలో నవశకం ప్రారంభమైంది. గ్రేటర్లో ఇప్పుడున్న ధర్మాస్పత్రులకుతోడు సకల సదుపాయాలతో మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో నగరానికి మూడువైపులా ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్లమార్కెట్), సనత్నగర్ (ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి), అల్వాల్(బొల్లారం)లలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి మంగళవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఒక్కోటి వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించే ఈ దవాఖానల్లో వైద్యసేవలు పూర్తిగా ఉచితమే. ప్రస్తుతం గ్రేటర్వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కలిపి 1300 సూపర్ స్పెషాలిటీ పడకలు మాత్రమే ఉండగా, కొత్తగా నిర్మించబోయే టిమ్స్ దవాఖానలతో మరో 4000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలి టిమ్స్ ద్వారా వెయ్యి పడకలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో గ్రేటర్ పరిధిలో మొత్తం సూపర్ స్పెషాలిటీ పడకల సంఖ్య 5300 చేరనుంది.
జిల్లాలకు చేరువకానున్న సూపర్ స్పెషాలిటీ సేవలు
గ్రేటర్ చుట్టూ నిర్మించబోయే టిమ్స్ దవాఖానల వల్ల నగరవాసులకే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. అల్వాల్-ఓఆర్ఆర్ మధ్య నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన వల్ల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల వారు ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా చేరుకోవచ్చు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ టిమ్స్ వల్ల నల్గొండ, వరంగల్, యాదాద్రి-భువనగిరి తదితర జిల్లాల వారికి, గచ్చిబౌలి టిమ్స్ వల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల వారికి సులువుగా వైద్యమందనుంది.
ఆ జిల్లాల నుంచి వచ్చే రోగులు నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రేటర్ సరిహద్దులో ఉన్న టిమ్స్లో సేవలు పొందొచ్చు. ఈ మూడు దవాఖానలు అందుబాటులోకొస్తే ఉస్మానియా, గాంధీ, నిమ్స్లపై భారం తగ్గడంతోపాటు అక్కడ అవయవ మార్పిడిలు, అరుదైన శస్త్రచికిత్సలు, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు మరింత పెంచే వీలుంటుందంటున్నారు వైద్య నిపుణులు. ఆయా కార్యక్రమాల్లో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, హోంశాఖ మంత్రి మహమూద్అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాగంటి గోపీనాథ్, మైనంపల్లి హన్మంతరావు, సాయన్న, కేపీ వివేకానంద, మంచిరెడ్డి కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, వాణీదేవి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్త, పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
వైద్యరంగంలో ప్రగతి
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఎంఎన్జే ఆస్పత్రులే ఇప్పటివరకు దిక్కు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు కొత్త దవాఖాన నిర్మించలేదు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతోపాటు వ్యాధులు, రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. కార్పొరేట్ దవాఖానలకు వెళ్లే స్థోమత లేనివారికి సర్కార్ దవాఖానలే శరణ్యం. దీన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ విద్య, వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈనెల 21న మూడింటి నిర్మాణానికి రూ.2679 కోట్లతో పరిపాలన ప్రభుత్వం అనుమతులిచ్చింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు గడ్డిఅన్నారం పండ్లమార్కెట్ టిమ్స్కు, తర్వాత ఎర్రగడ్డ ఛాతి దవాఖాన టిమ్స్, అనంతరం అల్వాల్లో టిమ్స్ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు.
వైద్యసేవలు మరింత విస్తరణ
ప్రతి టిమ్స్ దవాఖానలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో దవాఖానలో 16 పీజీ స్పెషాలిటీ కోర్సులు, 15 సూపర్ స్పెషాలిటీ కోర్సులు రానున్నాయి. వీటితో పాటు నర్సింగ్, పారామెడికల్ ఎడ్యుకేషన్ కోర్సులు ఉంటాయి. అంతేకాదు ఒక్కో టిమ్స్ దవాఖానలో 16 ఆపరేషన్ థియేటర్ల చొప్పున మూడింటిలో కలిపి మొత్తం 48 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి సూపర్ స్పెషాలిటీ దవాఖానలో క్యాథ్లాబ్, డయాలసిస్ సేవలు, రేడియేషన్, కీమోథెరపి, సీటీస్కాన్, ఎంఆర్ఐ సేవలు అందిస్తారు. ప్రతి టిమ్స్లో 200 మంది వైద్యనిపుణులు, 500 మంది రెసిడెంట్ డాక్టర్లను నియమించనున్నారు. ఫ్యాకల్టీ, రెసిడెంట్ డాక్టర్లకు ప్రత్యేకంగా క్వార్టర్లు నిర్మించనున్నారు.
ఒక్కో దవాఖానలో 30విభాగాలు
ఒక్కో టిమ్స్ దవాఖానలో 30 విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు, ఊపిరితిత్తులు, క్యాన్సర్, ఎండోక్రినాలజి, అలర్జీ, రుమటాలజి, ట్రామాకేర్ సేవలు, ల్యాబోరేటరీ తదితర విభాగాలతో కూడిన సేవలు అందించనున్నారు. స్వయంప్రతిపత్తి(అటానమస్) తో టిమ్స్ దవాఖానల నిర్వహణ ఉంటుంది. గచ్చిబౌలి టిమ్స్ కూడా ఇదే వర్తిస్తుంది.