మహానగరంలో ఒకప్పటి బస్తీలన్నీ పేదల ఆత్మగౌరవ ఇంటి కాలనీలుగా మారాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో పేదల సొంతింటి కలలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఒక్కో ఇల్లు 560 చదరపు అడుగల విస్తీర్ణంతో సకల సౌలత్లతో నిర్మాణమై ఉన్నాయి. ఒక్కో ఇంటిని రూ. 7.75 లక్షల వ్యయంతో నిర్మించి పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నారు. ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీల్లో ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సెఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ మౌలిక వసతుల కోసం ఒక్కో ఇంటికి రూ. 75 వేల చొప్పున రూ. 750 కోట్లు కేటాయించింది. అలాగే ఆయా కాలనీలకు లింక్ రోడ్ల కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా రూ. 51 కోట్లను కేటాయించింది. తాగు నీటి కోసం జలమండలి ప్రత్యేకంగా లైన్లు వేసి అవసరమైన నీటిని డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నది. దీంతో దుకాణాల కోసం ప్రత్యేక షట్టర్లు నిర్మించింది. ఇలా అత్యాధునిక వసతులతో డబుల్ ఇండ్ల కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా రూపుదిద్దుకున్నాయి.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఏ మహానగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో.. గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. వీటిని అర్హులైన వారికి సర్కారు విడతల వారీగా అందిస్తున్నది. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన గృహాల్లో లివింగ్ రూం, రెండు బెడ్రూంలు, కిచెన్, రెండు టాయిలెట్లు వంటి సౌకర్యాలే కాకుండా.. లిఫ్టులను సైతం నిర్మించారు. పైస తీసుకోకుండా.. ఇండ్లను ఉచితంగా అందిస్తుండటంతో నిరుపేదల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేమంటూ.. లబ్ధిదారులు ముఖ్యమంతికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఉచితంగా కేటాయింపు..
ఒక్కో ఇంటిని రూ. 7.75 లక్షల వ్యయంతో నిర్మించి పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సెఫ్టీతో పాటు సీసీ రోడ్లు, వీధి దీపాల వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇలా నగరంలో పలు చోట్ల నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రాజెక్టుల వద్ద కల్పిస్తున్న మౌలిక వసతుల కోసం ఒక్కో ఇంటి కోసం రూ. 75 వేలను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించడంతో పాటు అక్కడ మౌలిక వసతులతో కోసమే చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒక్కో యూనిట్కు 75వేల చొప్పున లక్ష యూనిట్లకు కలిపి మొత్తం రూ.750 కోట్లను కేవలం మౌలిక వసతుల కోసమే వెచ్చిస్తున్నారు.
నలగండ్లలో 1.21 ఎకరాల్లో..
శేరిలింగంపల్లి పరిధిలోని నలగండ్ల సర్వే నంబర్ 125లో 1.21 గుంటల విస్తీర్ణంలో రూ:18.68 కోట్లతో రెండు పడకల ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 11 అంతస్తుల్లో బహుళ అంతస్తుల భవన సముదాయం నిర్మించారు. సెల్లార్, గ్రౌండ్ ఫోర్లతో పాటు 9 అంతస్తులతో ఇండ్లు నిర్మించారు. మొత్తం ఈ ప్రాజెక్టులో 216 రెండు పడకల ఇళ్లు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు.
240 మందికి మూడు దశల్లో..
ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్లింగంపల్లి, సాయి చరణ్ కాలనీ, అంజయ్య నగర్లలో 240 మందికి మూడు దశల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చారు. లంబాడి తండా, సాయిచరణ్ కాలనీలో 9 అంతస్తులు, అంజయ్య నగర్లో 4 అంతస్తుల మేర ఇండ్లు నిర్మించారు. ఇక్కడ లిఫ్ట్, బోర్వెల్,వాచ్మెన్ నిర్వహణ కోసం షాపుల నిర్మించి వాటిని అద్దెలకు ఇచ్చారు. వాటి ద్వారా వచ్చే కిరాయిలతో నిర్వహణ చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఒకప్పుడు మురికి వాడలు..
డబుల్ బెడ్రూం ఇండ్లలో లిప్టు సౌకర్యం కల్పించడంతో పాటు నిరంతరం పనిచేసేందుకు జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అనుసంధానం రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందుకోసమే హెచ్ఎండీఏ ప్రత్యేకంగా రూ.51 కోట్ల దాకా వెచ్చించి రోడ్లను నిర్మిస్తున్నది. అదే విధంగా మంచి నీటి సౌకర్యం కోసం జలమండలి ప్రత్యేకంగా లైన్లు వేసి అవసరమైన నీటిని డబుల్ బెడ్రూం ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నది. అలాగే ఒకప్పుడు మురికి వాడలు అన్న పేరు ఆ ప్రాంతం.. ఇప్పుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో పేదల ఆత్మగౌరవ ఇండ్ల కాలనీలుగా మారాయి. హుస్సేన్సాగర్ తీరంలో రాణిగంజ్ బస్డిపో వెనక అంబేద్కర్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ప్రాజెక్టును ఆహ్లాదకరమైన సాగర తీరంలో అన్ని రకాల మౌలికవసతులతో నిర్మించి అర్హులైన వారికి అందజేశారు.
51 కోట్లతోఅనుసంధానరోడ్ల నిర్మాణం
గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టుల వద్ద మౌలిక వసతులే కాకుండా అదనంగా హెచ్ఎండీఏ నిధులతో అనుసంధాన రోడ్లు నిర్మిస్తున్నారు. సుమారు రూ.51 కోట్లతో మొత్తం 24 చోట్ల రోడ్ల నిర్మాణ పనులను హెచ్ఎండీఏ చేపట్టింది. వీటీలో రాంపల్లి,మంఖాల్-1,2,బాచుపల్లి, అమీన్పూర్-1, బండరావిర్యాల-1,2,3, బాచారం, ఈదులనాగులపల్లి ప్రాంతాల్లో అనుసంధాన రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగతా ప్రాంతాలైన తూంకుంట, శంకర్పల్లి-1,2, గాగిల్లాపూర్, భోగారం, మహబత్నగర్, జహవర్ నగర్-1,2,3, మల్లాపూర్, ఇంజాపూర్, అమీన్పూర్-2,3 ప్రాంతాల్లో అనుసంధాన రోడ్ల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
షెటర్లఅద్దెల ద్వారాఆదాయం..
వనస్థలిపురం రైతుబజార్ సమీపంలోని ప్రభుత్వ స్థలం జై భవానినగర్ కాలనీలో గతంలో పూర్తిగా గుడిసెలు ఉండేవి. అక్కడ మూడు బ్లాకులను 9 అంతస్తుల చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. మొత్తం 324 ఇండ్లు ఉన్నాయి. 60 ఫీట్ల ప్రధాన రహదారి పక్కనే ఈ సముదాయం ఉండడంతో విలువైన స్థలంగా మారింది. 3 బ్లాకుల చుట్టూ సీసీ రోడ్డుతోపాటు వాటి మధ్యలో కూడా మరో సీసీ రోడ్డును నిర్మించారు. అన్ని ఫ్లాట్ల వారికి అనుగుణంగా సెల్లార్లలో పార్కింగ్ను ఏర్పాటు చేశారు. బ్లాక్కు 2 చొప్పున లిఫ్టులు ఉండడంతో పై అంతస్తులకు వెళ్లేవారికి ఎలాంటి సమస్య లేదు. ప్రతి బ్లాక్కు ఒక బోరు, ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి. ఖరీదైన అపార్టుమెంట్లో ఉండే సకల మౌలిక వసతులు అందుబాటులో ఉండడంతో నిరుపేదలైన లబ్ధిదారులు ఎంతో ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. షెట్టర్లు అద్దెకు ఇవ్వగా, ప్రతి నెల రూ.80వేల వరకు ఆదాయం వస్తున్నది. మిగతావి సంక్షేమ సంఘం ద్వారా సేకరించి నిర్వహణ చేస్తున్నారు.
అల్లుడొస్తే ఉండడానికి ఇబ్బందులు పడి..
కుమ్మం రమ, ఉపేందర్ దంపతులు 30 ఏండ్లుగా సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే. వాచ్మెన్గా పనిచేస్తున్నారు. అప్పో, సొప్పో చేసి స్థాయికి తగినట్లుగా పెద్ద బిడ్డ లగ్గం చేసినా… అల్లుడొస్తే ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం అంటారు. ఎన్నో ఏండ్లుగా ఇల్లు కట్టుకునే స్తోమత లేకపాయేనే అంటూ ఆవేదన చెందిన ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లు భరోసానిచ్చింది. ఇంటికి వచ్చిన అల్లుడికి రాచమర్యాదలతో ఉండడానికి సర్కారు పెద్దింటిని ఇచ్చిందంటూ ఆ కుటుంబం మురిసిపోతున్నది.
– కుమ్మం రమ, ఉపేందర్ దంపతులు, సీతాఫల్మండి
కలలో కూడా అనుకోలే..
మా ఆయన ఫుట్పాత్పై డబ్బా పెట్టుకొని బండ్లకు పంక్చర్ చేస్తడు. మాకు ముగ్గురు ఆడపిల్లలు. అనారోగ్యంతో ఒక బిడ్డ చనిపోయింది. భర్త చేతికష్టం మీదనే ఆధారం. కిరాయి ఇంట్లనే జీవితం. తెలంగాణ ప్రభుత్వం గరీబోళ్లకు ఇండ్లు ఇస్తుందంటే దరఖాస్తు చేసుకున్నా. ఇల్లు వస్తదని కలలో కూడా అనుకోలేదు. సీఎం కేసీఆర్ సారు వల్ల ఈ రోజు నేను ఒక ఇంటికి యజమానురాలిని అయిన.
– బీ.మల్లమ్మ, అడ్డగుట్ట
జీతం రూ.14వేలు… ఇంటి కిరాయి రూ. 8500
నా భర్త ఓ చిరుద్యోగి. ఆయన జీతం రూ. 14 వేలు. ఇందులో కరెంటు బిల్లుతో కలిపి ఇంటి కిరాయి రూ.8500 పోతుంది. మాకు ఒక కొడుకు, కూతురు. కూతురు మానసిక వికలాంగురాలు. ఇల్లు కిరాయి పోగా కూతురు వైద్యం ఖర్చులు, ఇంటి ఖర్చులకు, కొడుకు ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ పరిస్థితిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావడంతో కిరాయి బాధ పోయినట్లే. మా కుటుంబానికి సీఎం కేసీఆర్ సారే దేవుడు.
– దూసరి లావణ్య, కుమ్మరివాడి, బాగ్అంబర్పేట
కల నెరవేరింది..
నా వివాహం అయినప్పటి నుంచి కిరాయి ఇండ్లలో ఉంటున్నాం.ఇప్పుడు నా వయస్సు 64. డబుల్ బెడ్రూం ఇల్లుకు దరఖాస్తు చేశాం. అనుకోని విధంగా నాకు ఇల్లు రావడం ఆనందంగా ఉంది. కిరాయి ఇండ్లలోనే ఉంటూ బిడ్డల వివాహాలు చేశాను. సొంత ఇంటి కల సాకారం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– డి.అనసూయ, గన్ రాక్ తిరుమలగిరి
50 ఏండ్లుగా ఇరుకింట్లో..
50 ఏండ్లుగా చిన్న ఇరుకింట్లోనే మసలుకున్నాం. మాకు నలుగురు కూతుర్లు, ఒక్క కొడుకు ఐదుగురికి వివాహలు చేశాం. మా ఆయన రిక్షా తొక్కేవాడు.. ఇప్పుడూ అనారోగ్యం పాలుకావడంతో ఇంట్లో ఉంటున్నాడు. 50 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సాయం చేయలేదు. కానీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ డబుల్బెడ్రూం ఇండ్లు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉన్నది. మా ఆయనకు అసరా పెన్షన్ కూడా వస్తుంది.
– సుక్క మైసమ్మ
జీవితం ధన్యమైంది
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డబుల్బెడ్రూం సీఎం కేసీఆర్ సారు ఇవ్వడంతో నా జీవితం ధన్యమైందని సంతోషపడుతున్నారు కొదండ పోచమ్మ. కాచిగూడ చెప్పల్బజార్లో 23 ఏండ్లుగా దివ్యాంగుడైన కొడుకుతో నివాసం ఉంటున్నారు. తన భర్త శ్రీనివాస్ ప్రైవేటు అఫీస్లో అటెండర్గా పనిచేస్తారు. 2016 సంవత్సరంలో డబుల్బెడ్రూం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, ఇల్లు మంజూరు కావడంతో పోచమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-పోచమ్మ
కష్టాలు తొలగిపోయాయి..
20 ఏండ్ల తరువాత అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి మారుతున్నాం. జియాగూడ ధరియాభాగ్లో 20 ఏండ్లుగా అద్దెకు ఉంటున్నాం. డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిన.. మా సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంతి కేసీఆర్కు కృతజ్ఞతలు. మా కష్టాలు తొలగిపోయాయి. అద్దె ఇంట్లో ఇబ్బందులు పడేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం చొరవతో మా ఇంటి కల సాకారమైంది.
– సుధ
సీఎం కేసీఆర్ మాకు దేవుడు
మా ఆయన ఆటో డ్రైవర్. నేను ఇండ్లలో పనిచేస్తాను.ఇద్దరం పనిచేసిన ఇంటి కిరాయి, పిల్లల ఫీజులు కట్టలేక అప్పులు పాలయ్యాం. మాకు డబుల్ బెడ్రూం ఇండ్లు రావడంతో ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక ముందు అద్దె కట్టడం తప్పుతుంది.. కాబట్టి చేసిన అప్పులు తీరిపోతాయి. నాకు ఇద్దరు కుమారులు వారిని మంచిగా చదివించుకుంటాను. సీఎం కేసీఆర్ మాకు దేవుడు. డబుల్బెడ్రూం ఇండ్లు వస్తాదని నమ్మకం లేకుండా కానీ.. మాకు ఇల్లు రావడంతో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోష పడుతున్నాం. మేము సొంత ఇంటిలో గౌరవంగా బతుకుతాం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ముఠా గోపాలకు రుణపడి ఉంటాం.
– ఎస్.విజయ
కలలో కూడా ఊహించలేదు..
‘కలలో కూడా ఊహించలేదు… రూపాయి ఖర్చు లేకుండా సొంతింటి కల నెరవేరింది…. ఎన్నో ఏండ్ల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్న మాకు డబుల్బెడ్రూం రావడం ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. మా సొంతింటి కలను సీఎం కేసీఆర్ నిజం చేశారు’. అని మలక్పేట పల్టన్ ప్రాంతానికి చెందిన పార్వతి
ఆనందం వ్యక్తం చేశారు.
– పార్వతి
ఇన్నేండ్లుగా రేకుల ఇళ్లే..
సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బీదల బస్తీలో అక్క పోచమ్మతో కలిసి బీదల బస్తీలోని ఓ రేకుల ఇంటిలో కిరాయి ఉంటున్నాం. పేరుకు రేకుల ఇళ్లు అయినా… కరెంటు బిల్లుతో కలిపి నెలనెల రూ. 2500 కట్టాల్సిందే. ఏ ఆధారం లేని నాతోపాటు మా అక్కకు గూడునిచ్చి సీఎం కేసీఆర్ ఆదుకున్నారు.
– మాచర్ల నర్సమ్మ, బీదల బస్తీ
ఏ తోడు లేని నాకు..
ఇద్దరి పిల్లలని కంటికి రెప్పలా పోషించుకుంటూ పులి సుశీల కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. వారాసిగూడలో నివాసం ఉంటూ… ఇరుగుపొరుగున ఇంటి పనులు, అక్కకు వచ్చే వృద్ధాప్య పించన్తో జీవనం సాగిస్తున్నది. రెండు పూటల పిల్లలకు తిండి పెట్టుడే కష్టమైన నాకు… పిల్లలు ఇద్దరికీ భరోసానిచ్చేలా సీఎం కేసీఆర్ డబుల్బెడ్రూం ఇంటిని అందించారని సంతోషపడుతున్నది. ఏ తోడు లేని నాకు బతుకమ్మ పండుగకు చీరలనిచ్చి … చిరకాలం బతికేందుకు నీడ నిచ్చారని చెప్పింది.
– పులి సుశీల, వారాసిగుడ నివాసి
నగరం నడిబొడ్డున సొంతిల్లు
పేదల ఇళ్లంటే గత ప్రభుత్వాల మాదిరిగా ఎక్కడో ఊరి చివర విసిరేసినట్టు కాకుండా నగరం నడిబొడ్డున డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్ సర్కారు నిర్మించింది. ఖరీదైన స్థలాల్లో భారీ భవంతులను పేదల కోసం సర్కారు నిర్మించి ఇచ్చింది. ఇళ్లల్లో పనులు చేసుకుని జీవించే మాకు ఇంత మంచి డబుల్ బెడ్రూం ఇల్లును ప్రభుత్వం ఇచ్చింది. ధనవంతులు కట్టుకునే ఇళ్ల మాదిరిగానే మా గరీబోళ్ల ఇళ్లను కూడా ప్రభుత్వం నిర్మించింది. సువిశాలమైన స్థలంలో డబుల్ బెడ్రూంలు ఉన్నాయి. ఇన్నాళ్లు ఇరుకు గదుల్లో.. అద్దె కొంపల్లో బతికాం. మా కష్టాలన్నీ తీరిపోనున్నాయి. మా బతుకులు బాగుపడుతున్నాయి. ఇల్లు వచ్చిందని అధికారులు వచ్చి.. డబుల్ బెడ్రూం పట్టా చేతికి ఇవ్వడంతో చెప్పలేని ఆనందంతో ఉన్నాం.
– పుష్పమ్మ,రహ్మత్ నగర్
కూరగాయలు అమ్ముతూ..
కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూ అద్దె ఇంట్లో జీవనం గడుపుతున్న మాలాంటి పేదలకు డబుల్ బెడ్రూం గృహాన్ని అందించి పేదల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలి.
అద్దె ఇంట్లో ఉంటూ కిరాయిలు చెల్లించలేక అవస్థలు పడుతున్న మాకు సొంత ఇంటి కల నెరవేరింది.
– కె శోభ
సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం..
ఎన్నో ఏండ్ల నుంచి లాల్బజార్ శాస్త్రీ నగర్ లో కూలీ పనులు చేసుకుంటూ నెలకు రూ.5 వేలు కిరాయికి ఉంటున్నాం.ఎవ్వరికీ లంచం ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇంటి పట్టాను అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ గొప్ప మనసును చాటుకున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం.
-ఇ.అరుణ.లాలాబజార్ శాస్త్రీ నగర్
నీడనిచ్చిన కేసీఆర్ చల్లంగుండాలే..
రోజు వారీ కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న మాలాంటి పేదలకు సొంత ఇల్లు అనేది పెద్ద కలే. కానీ సీఎం కేసీఆర్ సార్ పేదల ఆత్మబంధువై అండగా నిలుస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. ఏ ఒక్కరికీ రూపాయి లంచం ఇవ్వలేదు. లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇంటిని సీఎం కేసీఆర్ మాకు కానుకగా ఇచ్చారు. నిరుపేదలకు న్యాయం చేస్తున్న కేసీఆర్ సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే నాలాంటి మరెందరికో ప్రభుత్వ పథకాలు అందుతాయి.
– శాంతి