శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19: సెల్లార్ గుంతలో పడి ఓ యువతి మృతి చెందింది. ఈ మధ్యనే యువతి పెండ్లి నిశ్చయమైందని, ఏడాదిలో పెండ్లి ఉన్నదని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబీకులు బోరుమని విలపించారు. భవన నిర్మాణం కోసం భారీ సెల్లార్ గుంతను తవ్వి నిర్లక్ష్యంగా వదిలివేయడంతో తరచూ ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడ్డారు. యువతి మృతదేహంతో సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటన సోమవారం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం… నాగర్కర్నూల్ జిల్లా, లట్టుపల్లి నకల్చెరువు తండాకు చెందిన రమావత్ నాణు, హీరాబాయి దంపతులు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి గోపన్పల్లి ఎన్టీఆర్నగర్ కాలనీలో ఉంటున్నారు. నాణు ఆటోడ్రైవర్. భార్య హీరాబాయి ఇండ్లల్లో పనిచేస్తున్నది. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. ఇద్దరు పెద్ద కూతుళ్ల వివాహం జరిగింది. చిన్న కూతురు రాణి (17) యూసుఫ్గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నది. కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
ఆదివారం ఉదయం ఎప్పటిలాగే తండ్రి నాణు ఆటో తీసుకొని బయటకు వెళ్లగా.. హీరాబాయి పనులకు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాణి ఉదయం 10.30 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన హీరాబాయికి కూతురు రాణి ఇంట్లో కనిపించలేదు. భర్త నాణుకు విషయం తెలిపింది. ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు గోపన్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆచూకీ కోసం గాలించినా ఫలితం లభించలేదు. సోమవారం తెల్లవారుజామున రాణి ఆచూకీ కోసం గాలిస్తున్న నాణు.. ఎన్టీఆర్నగర్ కాలనీ సమీపంలోని ఓ భారీ సెల్లార్ గుంతలో చూడగా నీటిపై రాణి మృతదేహం తేలి కనిపించింది. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసి బోరున విలపించాడు.
నిర్లక్ష్యంగా వదిలేశారు.. ప్రాణాలు పోతున్నాయి..
సెల్లార్ గుంత సమీపంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో సెల్లార్ గుంత వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. గత కొన్ని ఏండ్ల కిందట తవ్విన సెల్లార్ గుంతను నిర్లక్ష్యంగా వదిలివేశారని, ఇప్పటికే గుంతలో పడి పలువురు మృతి చెందారని స్థానికులు వాపోయారు. మృతురాలి బంధువు రవి సైతం గతంలో ఇదే సెల్లార్ గుంతలో పడి మృతి చెందాడని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అక్కడకు చేరుకొని రాణి కుటుంబ సభ్యులు పరామర్శించారు.