హైదరాబాద్: దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓఆర్ఆర్ సమీపంలో అదుపుతప్పి జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో టెక్ మహింద్రా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతుడిని వరంగల్కి చెందిన అన్నమనేని మేఘాంశ్గా గుర్తించారు. అతడు టెక్ మహింద్రా వర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని చెప్పారు. సాయి మానస్, శ్రీ చరణ్ రెడ్డి, అర్నవ్ గాయపడ్డారని, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందన్నారు. . ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.