Hyderabad | కొండాపూర్, మార్చి 3 : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థితో కలిసి అదృశ్యమైన సంఘటన చందానగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగులేదని చెప్పి స్కూల్ నుంచి వెళ్ళిన ఉపాధ్యాయురాలు ఇంటికి వెళ్ళకుండా అదే స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థితో కలిసి వెళ్లిపోయింది. విషయం బయటకి రాకుండా స్కూల్ యాజమాన్యం ఇటు టీచర్ అటు విద్యార్థి తల్లిదండ్రులతో వేరువేరుగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయించినట్లు సమాచారం.
ఉపాధ్యాయురాలికి సంబంధించిన ఫిర్యాదు చందానగర్ పోలీస్ స్టేషన్లో నమోదు కాగా ఇటీవలనే అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు తన విద్యార్థితో ఇలాంటి పని చేయడంతో తెలిసిన వారు అవాక్కయ్యారు. స్కూల్ యాజమాన్యం సైతం తమ స్కూల్ పేరు పాడవుతుందని విషయం బయటకురానివ్వకుండా ఇరు కుటుంబాలతో సందికుదిర్చినట్లు సమాచారం.