మేడ్చల్, ఏప్రిల్23 (నమస్తే తెలంగాణ): ఖాళీ స్థలాలకు పన్నులు విధించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లతో పాటు విలీన మున్సిపాలిటీలైన మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్లలో ఖాళీ ప్లాట్లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఖాళీ ప్లాట్ల గుర్తింపు చివరి దశకు చేరిందని త్వరలోనే నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సర్కిళ్ల పరిధితో పాటు శివారు ప్రాంతంలోని మూడు మున్సిపాలిటీలలో వేల సంఖ్యలో ప్లాట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిపై పన్నులు విధించి సర్కిళ్లు, మున్సిపాలిటీలు ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించని క్రమంలో ఖాళీ స్థలాలపై పన్నులు విధిస్తే ఆదాయం సమకూరి అభివృద్ధి పనులతో ఇతరత్రా పనులకు వినియోగించుకోవచ్చన్న అభిప్రాయంతో ఖాళీ స్థలాలకు పన్నులను విధించనున్నారు. ఇప్పటికే ఆస్తి పన్నుల మదింపు కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు అధికారులు ఖాళీ స్థలాలకు పన్నుల ఖరారును త్వరలోనే చేయనున్నారు.