హైదరాబాద్: నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. టెక్సాస్ (Texas) మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో (Gun Fir) ఐశ్వర్య తో పాటు మరో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న మధ్యాహ్నం ఐశ్వర్య తన స్నేహితుడితో కలిసి టెక్సాస్లోని ఓ మాల్కు షాపింగ్కు వెళ్లింది. అయితే ఆ షాపింగ్ మాల్లోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో హైదరాబాద్లోని కొత్తాపేటకు చెందిన ఐశ్వర్య (27) ప్రాణాలు కోల్పోయింది. ఏడుగురు క్షతగాత్రుల్లో ఆమె స్నేహితుడు కూడా ఉన్నాడు.
రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి నర్సిరెడ్డి కూతురైన ఐశ్వర్య మూడేండ్ల క్రితం ఎంఎస్ చదవడం కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తయ్యాక పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న (ఇండియా కాలమానం ప్రకారం ఈ నెల 6న శనివారం రాత్రి) కుటుంబసభ్యులతో ఐశ్వర్య ఫోన్లో మాట్లాడారు. అనంతరం సమీపంలోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లారు. మాల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో మొత్తం ఎనిమిది దుర్మరణం చెందారు. వారిలో ఐశ్వర్య కూడా ఉంది. గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఐశ్వర్యను వేలిముద్రల ఆధారంగా అక్కడి పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యువతి స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల.