Hyderabad | సిటీబ్యూరో/కొండాపూర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : వరదను సాఫీగా దిగువకు పోనిస్తే ఎంత పెద్ద వర్షం పడినా.. నష్టం జరగదు. అదే వరదకు అడ్డుకట్ట వేస్తే వీధులు, కాలనీలు, ఇండ్లను ముంచేస్తుంది. సరిగ్గా వరద నీటికి అడ్డుకట్ట వేస్తూ ఓ నిర్మాణదారుడు ఏకంగా ప్రహరీతో పాటు బాత్ర్రూంల నిర్మాణాలు చేపట్టాడు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధి తారానగర్ తుల్జా భవానీ ఆలయ సమీపంలో వరద నీటి కాలువపై నిర్మిస్తున్నాడు. కండ్ల ముందు అక్రమ నిర్మాణమని తెలిసినా జీహెచ్ఎంసీ అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూడటం లేదు.
టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల సమన్వయ లోపంతో నాలాపై అక్రమ నిర్మాణం జరుగుతున్నది. ఫలితంగా రాబోయే వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేకపోవడంతో తారానగర్ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రూ.కోట్లు ఖర్చు పెట్టి వరద నీటి కాలువ, నాలాను పునరుద్ధరించిన అధికారులు.. అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేక పోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. వీలైనంత త్వరగా నిర్మాణాలను తొలగించకపోతే భవిష్యత్లో వరదనీటి సమస్యలు పునరావృతమవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా.. 390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే పనులను సకాలంలో చేయకుండా వరద నీటి ముంపునకు అధికారులే పరోక్షంగా కారణమవుతున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 979 పనులకు రూ.546.72 కోట్లు మంజూరు కాగా, రూ.220.75కోట్లు ఖర్చు చేసి 470 చోట్ల పనులను మాత్రమే పూర్తి చేశారు. ఇదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 543.26 కోట్లతో 888 ప్రాంతాల్లో పనులు చేపట్టాల్సి ఉన్నా..ఇప్పటి వరకు రూ.162.53 కోట్లు ఖర్చు చేసి 311 చోట్ల మాత్రమే పనులు పూర్తి చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. వచ్చే మూడు నెలల్లోగా పనులు పూర్తి చేయకపోతే వరద ముంపు సమస్యలు తప్పేలా లేవు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వరద ముంపు నివారణ చర్యలను వేగవంతంగా చేయాలని స్థానికులు కోరుతున్నారు.