సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తొమ్మిది కోట్లు రుణంగా ఇప్పిస్తానంటూ నమ్మించి, టీడీఎస్, జీఎస్టీ పేరుతో రూ.17 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన బాధితుడికి స్నేహితుడి ద్వారా వర్మరాజ్ పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్ కాల్లో పరిచయమయ్యాడు. ఒక్క రూపాయి వడ్డీతో రూ. 9 కోట్లు రుణంగా ఇప్పిస్తానని, ఆధార్కార్డు, ప్యాన్, ఇతర బ్యాంకు వివరాలను తీసుకున్నాడు.
లోన్ ఇవ్వాలంటే ముందుగా టీడీఎస్ చెల్లించాలంటూ రూ. 9 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత జీఎస్టీ పేరుతో రూ. 8 లక్షలు వసూలు చేసి, సెల్ఫోన్ స్విచాఫ్ చేశాడు. మొత్తం రూ. 17 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ హరికృష్ణ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఎం.శంకర్ బృందం కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టింది. నిందితుడు తమిళనాడు, తిరువళ్లూర్కు చెందిన రమేశ్ ఎలుమలైగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నగరానికి తరలించారు. కాగా, నిందితుడిపై ఎల్బీనగర్, సైబర్క్రైమ్ ఠాణా, కేపీహెచ్బీలో కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.