సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ): ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో తలసాని పాల్గొని మాట్లాడారు. జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉన్నందున, అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సర్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయని చెప్పారు. రెండున్నర సంవత్సరాల తర్వాత తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జూన్ 14న నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశానికి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని తెలిపారు. కాంగ్రెస్ పోవాలి… కేసీఆర్ రావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారని తలసాని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, సముచిత స్థానం లభిస్తుందని స్పష్టం చేశారు. మాగంటి సునీతాగోపీనాథ్, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్చార్జి పి.విష్ణువర్ధన్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దేదీప్య, రాజ్ కుమార్, షఫీ పాల్గొన్నారు.