హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని మోదీ (PM Modi) అనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అభివృద్ధి జరుగుతున్నదని స్పష్టం చేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని గోల్నాకాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అంబర్పేటకు (Amberpet) 15 ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan reddy) గత నాలుగేండ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా అంబర్పేటలో ఓడిపోవడంతోనే కేంద్ర మంత్రి కాగలిగారని, అందుకు బీఆర్ఎస్ కృతజ్ఞతలు చెప్పాలన్నారు.
దేశంలో సీఎం కేసీఆర్ను (CM KCR) ఢీకొట్టగలిగిన నాయకుడు మరెవరూ లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలుమాని ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా? అన్ని ప్రశ్నించారు. కుల, మతాల పేరుతో లబ్ధిపొందాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మతాలను గౌరవిస్తూ అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.