హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): అశాస్త్రీయంగా, అడ్డగోలుగా, గూగుల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలను విభజిస్తున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. టెక్నికల్ స్టడీ లేకుండా మహానగరాన్ని ఇష్టమొచ్చినట్టుగా విడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంట నగరాల ఉనికి లేకుండా, సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా మద్దతిచ్చే పార్టీలతో కలిసి ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పారు. అనంతరం మేధావులు, వివిధ సంఘాల నేతలు, విద్యార్థి నేతలతో చర్చించి రైలురోకో, ధర్నాలు, ర్యాలీలు చేపడతామని వెల్లడించారు.
ప్రజాపోరాటాలు ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. తెలంగాణభవన్లో శనివారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ముఠా గోపాల్, పార్టీ నేత పవన్కుమార్తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యంలో ఉన్న జంట నగరాలను డీలిమిటేషన్తో 300 వార్డులు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని చెప్పారు. నగర మేయర్, డిప్యూటీ మేయర్కు కూడా తెలియకుండా చేయాల్సిన రహస్య ఏజెండా ఏమున్నదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ అంటే కంటోన్మెంట్, రాష్ట్రపతిభవన్, లష్కర్ బోనాలు సికింద్రాబాద్ పేరు లేకుండా ఇష్టానుసారంగా విభజిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
సికింద్రాబాద్ను విస్మరిస్తే ఊరుకోబోమని, సికింద్రాబాద్ను కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూడండి అని సవాల్ విసిరారు. మహానగర విభజనపై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని తలసాని ఆగ్రహం వ్యక్తంచేశారు. డివిజన్లను కూడా సరిగా విభజించ లేదని మండిపడ్డారు. 24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశామని గుర్తుచేశారు. రాజ్యమున్నదని రాజరికంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్టుగా విభజించాలని చూస్తే చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. ప్రభుత్వ అవగాహన లేమి చర్యల ఫలితంగా పనుల కోసం ప్రజలు నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
ఎంతోమంది ముఖ్యమంత్రులను, స్పీకర్లను చూశాంగానీ, ఇలాంటి ముఖ్యమంత్రిని, స్పీకర్ను చూడలేదని తలసాని ఎద్దేవా చేశారు.గంటన్నరపాటు రేవంత్రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్నా స్పీకర్ అడ్డుచెప్పలేదన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు కూడా వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ కనీసం ప్రతిపక్ష సభ్యుల వైపు చూడటం లేదని, ప్రజా సమస్యలపై పోరాడటం, మాట్లాడటం ప్రతిపక్ష పార్టీగా తమ పని అని చెప్పారు. కానీ, స్పీకర్ ప్రతిపక్ష పార్టీని నిలువరిస్తున్నారని మండిపడ్డారు. విప్లు ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య సమన్వయానికి పనిచేయాలిగానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదని, అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్తునే.. తమ అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన భాష మార్చుకోవాలని హితవుపలికారు.
రాష్ట్రం పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైందని ఎమ్మెల్యే వివేకానంద్ విమర్శించారు. అవగాహన రాహిత్యంతో సీఎం తీసుకునే చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. రేవంత్రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని, డిలిమిటేషన్ పేరుతో హైదరాబాద్ను కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం విభజనపై గొంతెత్తుతున్నారని, ఎమ్మెల్యే మల్రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్ విభజనపై అసెంబ్లీలో నిరసన తెలిపారని గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక మంత్రి కూడా లేదని, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా నగర విభజనపై సమగ్ర చర్చ జరగలేదని విమర్శించారు.
చట్టవిరుద్ధంగా హైదరాబాద్ మహానగర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆక్షేపించారు. పరిపాలన సాలభ్యం కోసం కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు, మహానగర సంస్థలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని, ఎకడ ఎలాంటి ఇబ్బంది కలుగలేదని చెప్పారు. రేవంత్రెడ్డి మహానగర విభజనను గందరగోళంగా చేస్తున్నారని, దీనిపై ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీఎంకు ఉదయం 111 గంటల వరకు ఇన్కమింగ్, ఆ తర్వాత ఔట్గోయింగ్, సాయంత్రం మిగలినవి కౌంటింగ్ తప్ప ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంకు కలెక్షన్ల మీద తప్ప దేని మీద ధ్యాస లేదని విమర్శించారు.