అమీర్పేట్,జూలై 18:ఈ నెల 21న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లకు సంబంధించి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వివిధ విభాగాల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశం వాడిగా వేడిగా సాగింది. కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికార యంత్రాంగంతో కలిసి నిర్వహించిన సమీక్షకు పూర్తి భిన్నంగా శనివారం నాడు ఎమ్మెల్యే తలసాని సమీక్ష కొనసాగింది. ఎల్లమ్మ కల్యాణోత్పవంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములయ్యే భక్తులు, స్థానికులు తమ ఇబ్బందులు చెప్పుకునే అవకాశం లభించడంతో సమీక్ష అర్ధవంతంగా సాగింది.
సమీక్షలో పాల్గొన్న అధికారులకు కూడా స్థానికుల సమస్యలను పరిగణనలోకి తీసుకునే అవకాశం కలిగింది. వేడుకల విజయవంతానికి ఎప్పటిలాగే బల్కంపేట వాసులు వివాదాలకు అతీతంగా అంతా ఏకమై విజయవంతం చేయాలన్నారు. శనివారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో దేవాలయ ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో వినోద్రెడ్డి, జీహెచ్ఎంసీ అమీర్పేట్ డిప్యూటీ కమిషనర్ సుజాత, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.
కల్యాణోత్సవాన్ని పపురస్కరించుకుని మంగళ, బుధవారాల్లో జరిగే వేడుకలకు పోలీసుల బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేపడుతున్న చర్యలపై ఎమ్మెల్యే పోలీసులను అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. అమ్మవారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు రెండు రోజుల్లో దాదాపు 7 లక్షల మంది భక్తులు దేవాలయానికి తరలివస్తారని, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికార యంత్రాంగానికి వివదాలకు అతీతంగా బల్కంపేట వాసులు, వివిధ పక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు తమ చేయూతనందించాలన్నారు.