కంటోన్మెంట్, నవంబర్ 20 : నగరం నడిబొడ్డున ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ మైదానంలో సభ ఏర్పాట్లపై కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత, ఎమ్మెల్సీలు ప్రభాకర్, దయానంద్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఎంఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్రెడ్డి, నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి, ఏసీపీలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఈ సభకు వస్తారని తెలిపారు. జీఓ 58, 59ల క్రింద నగరంలో వేలాదిమందికి ఇంటి స్థలాలను రెగ్యులరైజేషన్ చేశామని తెలిపారు.
నగరంలో సొంత ఇల్లు లేని సుమారు 70 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేశామని చెప్పారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తామని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి గద్దల్లా వాలారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 40 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేదని, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడ ఉందని ప్రశ్నించారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వంట గ్యాస్ సిలెండర్ను రూ. 400లకు ఇస్తామని, రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో తెలిపారని వివరించారు.
పరేడ్లో భారీ బహిరంగ సభకు సంబంధించి 24 ప్రాంతాల్లో పార్కింగ్ కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. 25వ తేదీ సాయంత్రం సభ నిర్వహిస్తున్నందున సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం వేదిక ఏర్పాటు, ప్రజలు కూర్చునే ప్రదేశం, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్ ఏర్పాటుపై స్థానిక నాయకులతో మంత్రి చర్చించారు. తాగునీరు, తదితర సౌకర్యాల గురించి స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. ఆదే విధంగా నార్త్జోన్ డీసీపీతో పాటు పోలీస్ అధికారులతో సభకు సంబంధించిన అంశాలపై మంత్రి తలసాని సుధీర్ఘంగా చర్చించారు. సభకు బందోబస్తుతో పాటు ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, అనితాప్రభాకర్, లోక్నాథం, నళినికిరణ్తో పాటు నేతలు కన్నాయాదవ్, పవన్కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నర్సింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.