సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,సెప్టెంబర్ 23 (నమస్తేతెలంగాణ) ;నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. సకల హంగులు.. చక్కటి మౌలిక సదుపాయాలతో నయాపైసా ఖర్చులేకుండా ఇండ్లను పేదలకు అప్పజెప్పుతున్నది. ఇప్పటికే రెండు విడతల్లో ఏకంగా 24,900 గృహాలను పంపిణీ చేయగా, మరోసారి భారీ ఎత్తున ఇండ్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులోభాగంగా మూడు, నాలుగు విడతల్లో ఏకంగా 21 వేల ఇండ్లను పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 27న ఇందుకు సంబంధించి..ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ డ్రా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, కలెక్టర్ అనుదీప్తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంపికైన అర్హులకు వచ్చే నెల 2న 10, 500 మందికి, 5న మిగిలిన వారికి ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా.. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించి.. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
“బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనాదిగా నిలుస్తున్నది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు ఆత్మ గౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ అర్హులందరి సొంతింటి కలను నెరవేరుస్తున్నారు. హైదరాబాద్ మహా నగరం పరిధిలో ఇప్పటికే పలు చోట్ల ఎంతో మంది నిరుపేదలను తెలంగాణ సర్కారు అక్కున చేర్చుకొని వారి సుదీర్ఘ కల అయిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని సాకారం చేసింది. పలు విడతలుగా పేదోళ్లను పెద్ద పెద్ద భవంతులలోకి తీసుకొచ్చి ప్రభుత్వం వారి ముఖాలలో సంతోషాన్ని నింపింది. అంతే కాకుండా ఇప్పుడు మరో రెండు విడతల్లో గ్రేటర్ పరిధిలోనే 21 వేల ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. వాటిని ఈ నెల 27, వచ్చే నెల 2, 5వ తేదీలలో పంపిణీ చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతోంది.”
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల లోపు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేసి తీరుతాం… అని సీఎం కేసీఆర్ చెప్పిన మాట అక్షరాలా నెరవేరుతుంది. రేకుల షెడ్లు.. అద్దె ఇండ్లల్లో అనేక వ్యయ ప్రయాసలకు ఓరుస్తూ కాలం వెల్లదీస్తున్న పేదల సొంతింటి కల సాకారం అవుతుంది. విడతల వారీగా వేలాది మంది పేదోళ్లు తమ ప్యాలెస్లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో ఏకంగా 24,900 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం, మరో రెండు విడతల్లో భారీ ఎత్తున ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. మూడు, నాలుగు దఫాల ద్వారా 21 వేల ఇండ్ల పంపిణీ ప్రక్రియను రానున్న 12 రోజుల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్ రాస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి సమీక్ష నిర్వహించారు.
నిరాటంకంగా ఇండ్ల పంపిణీ
గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ నిరాటంకంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం కేవలం గ్రేటర్ పరిధిలోనే లక్ష ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టగా, అందులో దాదాపు 70 వేల వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణం పూర్తయి, మౌలిక వసతుల కల్పన కూడా పూర్తయిన చోట ఇండ్ల పంపిణీని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారి జాబితాను గతంలోనే అధికార యంత్రాంగం సిద్ధం చేసుకుంది. ఆ జాబితా ఆధారంగానే విడతల వారీగా ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ డ్రా తీసి, లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ర్యాండమైజేషన్ విధానంలోనే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికతో రెండు విడతలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 21 వేల ఇండ్ల పంపిణీపై శనివారం సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాటిని రెండు దఫాలుగా పంపిణీ చేస్తామని ప్రకటించారు.
అయితే, మూడు, నాలుగు విడతల పంపిణీకి సంబంధించి ఈ నెల 27న ఒకేసారి డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రెండో విడతలో మాదిరిగానే హైదరాబాద్ కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ డ్రా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేసి, ఇండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మొదటి, రెండో విడతలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఎన్ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ డ్రా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే ఆన్లైన్ డ్రాలో మూడు, నాలుగో విడతలకు సంబంధించి 21 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వారికి వచ్చే నెల 2వ తేదీన 10,500 మందికి, ఐదో తేదీన మిగిలిన 10,500 మందికి చొప్పున ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసే ప్రక్రియ కొసాగుతుందని మంత్రి తెలిపారు.