సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కమలానగర్ ఎస్పీఆర్హిల్స్లో రూ. 1785 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని మంత్రి తలసాని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా 2 బీహెచ్కే డిగ్నిటీ ఇండ్లను హైదరాబాద్లో లక్షకు పైగా నిర్మిస్తున్నామని తెలిపారు. కమలానగర్లో రెండు బ్లాక్లలో 7 లిఫ్ట్లతో మొత్తం 210 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మొత్తం రూ. 16 కోట్ల 27 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో చేపట్టారని, రూ.157.50 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పించామన్నారు.
ఈ కాలనీకి లక్ష లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యంతో పాటు 15 దుకాణాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకో డబుల్ బెడ్రూం ఇంటికి రూ. 8,50,000 వ్యయం అయినట్లు చెప్పారు. 89 మంది లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేపట్టామని, మిగతా 121 మందికి స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు పరిశీలించి త్వరలోనే అందజేస్తామని తెలిపారు. స్థానికంగా నివాసం ఉండి ఆధార్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యత క్రమంలో డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నామని తెలిపారు. దీనికి ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించినట్లు చెప్పారు. నోటరీ ఇండ్లలో నివసిస్తున్న పేదలకు 58 జీవో ద్వారా ఇండ్ల పట్టాలను అందజేస్తామని తెలిపారు. బస్తీవాసులకు బస్సు సౌకర్యం, తాగునీటి వసతి, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఐదుగురికి ఇండ్ల పట్టాలతో పాటు తాళం చెవిలు అందజేశారు.
ప్రతి పేదవాడికి ఇండ్లు ఉండాలని, అందుకే కోట్లాది రూపాయలతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు పేదవాడి జీవితాలతో రాజకీయం చేయడం తప్ప ఇంకా ఏం చేతకాదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎక్కడ కట్టారో చూపించాలన్న ప్రతిపక్షాలు ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. పండుగ వాతావరణంలో ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. కమలానగర్ ప్రజలు నిరాశ చెందకూడదని, ప్రతి ఒకరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను దశల వారీగా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మీర్జా రహమత్ బేగ్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్, ఆర్డీవో వసంత, జీహెచ్ఎంసీ సీఈ సురేశ్, ఎస్ఈ విద్యాసాగర్, ఈఈ వెంకటదాసు, వాటర్ వర్స్ సీజీఎం ప్రభు, కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, దేదిప్య తదితరులు పాల్గొన్నారు.