Drugs Case | సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): అమ్మేవాడు ఎవరో తెలియదు.. కొనేవాడు అమ్మేవాడికి తెలియదు. అంతా ఇంటర్నెట్లో డ్రగ్స్ బేరం. బ్యాంకు ఖాతాలో నగదు జమ. అమ్మేవాడు ఒక చోట డ్రగ్స్ పడేసి (డెడ్ డ్రాప్) వెళ్తాడు. కొన్నవాడు ఆ ప్రాంతానికి వెళ్లి డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటాడు. నిఘా వ్యవస్థలకు అనుమానం రాకుండా ఇలా బెంగళూర్ కేంద్రంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్- న్యాబ్) అరెస్ట్ చేసింది. కోటి రూపాయల విలువైన డ్రగ్స్ను వారి నుంచి స్వాధీనం చేసుకుంది. గోవా, ముంబై నెట్వర్క్ తరువాత బెంగళూర్ నెట్వర్క్పై ఫోకస్ పెట్టి, ఈ ముఠాను అరెస్ట్ చేసినట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించాడు. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నైజీరియాకు చెందిన అగ్బోవో మ్యాక్స్వెల్ నన్బుహ్షి అలియాస్ కెవ్క్ ఇస్సుమాన్ క్వామె 2011లో మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చి ముంబైలో డ్రగ్స్ దందాను మొదలు పెట్టాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో కొన్నాళ్ల తర్వాత తన మకాం బెంగళూర్కు మార్చాడు. బెంగళూర్కు వెళ్లిన తర్వాత తన పేరును కెవ్క్ ఇస్సుమాన్ క్వామెగా మార్చుకొని, దానిపై నకిలీ పాస్పోర్టు, నకిలీ వీసా సృష్టించాడు. ఆ నకిలీ పత్రాలతో బెంగళూర్లోని ఎంఎస్నగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నాడు. అతడికి బెంగళూర్లో నివాసముండే నైజీరియాకు చెందిన మాజీ తనవంతు సహకారం అందించాడు. కొన్ని నెలల తర్వాత తమ అడ్డాను బెంగళూర్లోని అచ్యుతనగర్కు మర్చారు. అక్కడ కాలేజీలు, యూనివర్సిటీలు ఉండటంతో ఆ ప్రాంతంలో విద్యార్థులను ఆకర్షిస్తూ తమ వ్యాపారాన్ని విస్తరించారు.
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మ్యాక్స్వెల్ వర్చువల్ ఫోన్ నంబర్ (వాయిస్ కాల్స్)తో మాట్లాడేవారు. వీళ్లకు నైజీరియాకు చెందిన ఎవ్విలైన్ యెరెంకీవా అనే మహిళ తమిళనాడులోని కోయంబత్తూర్లో ఒక జాతీయ బ్యాంక్లో ఖాతాను తెరిచి అప్పగించింది. ఆ బ్యాంకు ఖాతాను తమ డ్రగ్స్ దందా కోసం నిందితులు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరికీ 2012లో వ్యాపార వీసాపై భారత్కు వచ్చి బెంగళూర్లో ఉంటున్న ఓకీకె చింగ్జ్యూ బ్లెసింగ్, 2021లో స్టూడెంట్ వీసాపై వచ్చిన ఐకమ్ అస్టిన్ ఓబాక అలియాస్ కింగ్స్లే, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాయిఆకాశ్, మణికొండకు చెందిన భాను తేజారెడ్డి, కేరళకు చెందిన సంజయ్ సునీల్కుమార్ తోడయ్యారు. వీళ్లంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు.
ఇదిలాఉండగా.. గతంలో సంజయ్ సునీల్, భాను తేజారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు ఇచ్చిన సమాచారంతో టీన్యాబ్ ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం రెండు నెలలుగా ఈ నెట్వర్క్ను ఛేదించేందుకు నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే నైజీరియాకు చెందిన మాజీ మినహా ఈ ముఠాలోని మిగతా నలుగురిని టీన్యాబ్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 300 గ్రాముల ఎండీఎంఏ, 100 గ్రాముల కొకైన్, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని ఐకమ్ అస్టిన్ ఓబాకతో కలిసి ఉన్న ఘానా దేశానికి చెందిన ఫెలిక్స్ అవోన్యోను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి డ్రగ్స్ దందాతో సంబంధం లేకపోవడంతో ఘాన దేశానికి డిపోర్ట్ చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
నేరస్థుల కోసం సహాయనిధి..
డ్రగ్స్ దందాతో పాటు వివిధ నేరాలు చేసే కొందరు నైజీరియన్లు ఒక వాట్సాప్ గ్రూప్ను తయారు చేసుకొని, ఎవరైనా అరెస్టయితే వాళ్లకు కావాల్సిన న్యాయ, ఆర్థిక సహాయాన్ని ఈ గ్రూప్ ద్వారా అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని సీపీ తెలిపారు. ఒక వ్యవస్తీకృత పద్ధతిలో నేరాలు చేస్తున్న విషయం మొదటిసారిగా బయట పడిందన్నారు. రెండునెలల్లో ఈ గ్రూప్ సహాయ నిధి కింద రూ. 8.5 లక్షలు జమ చేసిందని సీపీ తెలిపారు.
మాదక ద్రవ్యాలపై జాతీయ సమన్వయ సమావేశం మొదటిసారిగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద నార్కొటిక్ కో-ఆర్డినేషన్ మీటింగ్ జరిగిందని సీపీ తెలిపారు. అందులో విద్య, ఆరోగ్య శాఖ, ఎఫ్ఆర్ఆర్, ఇంటెలిజెన్స్ తదితర విభాగాలు హాజరయ్యాయన్నారు. డ్రగ్స్ నెట్వర్క్పై ఈ సమావేశంలో చర్చించామని, అక్రమంగా హైదరాబాద్లో తిష్టవేసిన విదేశీయులు, డ్రగ్స్ దందా చేసే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని సీపీ వివరించారు. ఈ సందర్భంగా బెంగళూర్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందా నెట్వర్క్పై కూడా చర్చించామని సీపీ తెలిపారు.
బ్యాంక్ ఖాతాలు ఆరా..
డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ ముఠా నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల్లో ఆరు నెలల్లో రూ. 4 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. డిపాజిట్లు, విత్డ్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు ఒక ఫైనాన్స్ ఆడిటింగ్కు ఆ ఖాతాను ఇచ్చామని, అందులో హైదరాబాద్ నుంచి ఎవరెవరు డిపాజిట్ చేశారనే విషయాలు బయటపడుతాయని సీపీ వివరించారు.