మన్సూరాబాద్, సెప్టెంబర్ 1 : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం సేవించి వచ్చి దాడిచేయడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, అల్తాఫ్నగర్లో నివాసముండే దాసరి సురేందర్ అలియాస్ మొయిన్ మీర్పేట్, నందనవనం కాలనీలో నివాసముండే సబాఫాతిమా (18)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి తొమ్మిది నెలల పాప ఉన్నది. అయితే మొయిన్ను 2021 డిసెంబర్లో ఓ దొంగతనం కేసులో బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
జైలు నుంచి జూలై 2022లో విడుదలయ్యాడు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న మొయిన్ మద్యం సేవించి వచ్చి వేధించసాగాడు. ఆగస్టు 30న అర్ధరాత్రి మొయిన్ మద్యం సేవించి వచ్చి ఫాతిమాపై దాడి చేయగా తీవ్ర గాయాలు కావడంతో దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ 31న మృతి చెందింది. ఫాతిమా తల్లి షాబనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త మొయిన్, అత్త యాదమ్మ, కీర్తిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారుతరలించారు.