బంజారాహిల్స్, మే 27 : అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి గర్భవతిని ఆరుగంటల పాటు బంధీగా తీసుకుని సినీ ఫక్కీలో రూ.10లక్షలను దోచుకున్న ఓ నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.52లో ప్రముఖ వ్యాపారవేత్త ఎన్ఎస్ఎన్.రాజు నివాసంలోకి మే 11న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి ఆయన కుమార్తె నవ్యను కత్తితో బెదిరించాడు. మెడపై కత్తిపెట్టి తనకు రూ.25 లక్షలు కావాలని బెదిరించాడు. కూతురి గదిలోకి వచ్చిన తల్లి లీలను సైతం బెదిరించడంతో మరుసటిరోజు ఉదయం 10గంటల సమయంలో అల్లుడు మనీశ్రెడ్డికి ఫోన్ చేసి రూ.8లక్షలు తెప్పించారు.
ఇంట్లో ఉన్న రూ.2లక్షలను కలిపి మొత్తం రూ.10లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కాగా, సీసీ ఫుటేజీలతోపాటు పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ దోపిడీకి పాల్పడిన వ్యక్తిని రెజిమెంట్ బజార్లో నివాసం ఉంటున్న మోతీరామ్ రాజేశ్యాదవ్(27) అనే కాల్ సెంటర్ ఉద్యోగిగా గుర్తించారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ కాల్సెంటర్లో పనిచేస్తున్న రాజేశ్ యాదవ్ గత కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం దోపిడీకి పాల్పడ్డట్లు తేలింది. నిందితుడు రాజేశ్ యాదవ్ను శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు స్కెచ్..
మే 12న గర్భిణిని కత్తితో బెదిరించి రూ.10లక్షలు దోచుకెళ్లిన రాజేశ్ యాదవ్ పక్కా ప్రణాళికతో పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తున్నది. దోపిడీ చేసిన అనంతరం బాధితురాలి ఫోన్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్న నిందితుడు షాద్నగర్ దాకా వెళ్లాడు. అక్కడ దిగిన రాజేశ్ యాదవ్ బస్స్టాండ్లో సుమారు 3గంటల పాటు తచ్చాడాడు. దోపిడీ ఘటన బయటకు వచ్చినా నేరుగా బెంగళూరు, గోవా వైపునకు నిందితుడు వెళ్లి ఉంటాడని పోలీసులు భావించాలనే ఉద్దేశంతో షాద్నగర్లో దిగాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. షాద్నగర్ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్న రాజేశ్ యాదవ్ హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. నేరుగా రెజిమెంటల్ బజార్లోని తన ఇంటికి వెళ్లాడని తెలుస్తున్నది. తనవద్దనున్న డబ్బులో నుంచి రెండున్నర లక్షలతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయడంతోపాటు కొంత డబ్బును పాతబాకీలు చెల్లించేందుకు ఉపయోగించినట్లు తెలిసింది. చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఏదైనా భారీ దోపిడీ చేయాలనే ప్లాన్తో జూబ్లీహిల్స్లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు.