దుండిగల్, ఏప్రిల్ 20: విద్యుత్ మీటర్లను చోరీచేసి ఒకే గదిలో డంపింగ్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. గండి మైసమ్మ దుండి గల్ మండలం, దుండిగల్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 454 ప్రభుత్వ భూమి, పల్లవి ఆశ్రమం దగ్గరలో గల ప్రభుత్వ భూమిలో ఉన్న ఓ గదిలో పెద్ద మొత్తంలో గృహవినియోగానికి వినియోగించే కరెంటు మీటర్లు డంపింగ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఈ సాయి, ఎలక్ట్రికల్ సిబ్బందితో కలిసిన పోలీసులు ఉమ్మడిగా దాడులు నిర్వహించగా మొత్తం ఒకే గదిలో 30 ఎలక్ట్రిక్ మీటర్లు లభించాయి.
వేణుగోపాల్ అనే వ్యక్తి గత రెండేళ్ల నుంచి బిల్లులు చెల్లిస్తూ ఒకే గదిలో ఈ మీటర్లు డంపింగ్ చేసినట్లు తేలింది. ఆ ఎలక్ట్రిక్ మీటర్లకు ఎటువంటి ఇంటి నంబర్లు గానీ, సరైన పత్రాలు గానీ లేకపోవడంతో పాటు ఎటువంటి అనుమతులు పొందుపరచకుండానే నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.
ఆ ఎలక్ట్రిక్ మీటర్లను ప్రభుత్వ స్థలాలను అక్రమంగా వినియోగించడంతో పాటు వాటిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు కుట్రపూరితంగా దాచిపెట్టినట్లు తేలిందని సీఐ సతీశ్ స్పష్టం చేశారు. ఒకే గదిలో డంపు చేసిన మీటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం నిందితుడు వేణుగోపాల్ ను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో విద్యుత్ శాఖ సిబ్బంది సైతం ఇందులో పాలుపంచుకున్నట్టు తెలిసిందని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు.