ఘట్కేసర్, డిసెంబర్ 22 : ఆపదలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయనిధి పేద పాలిట వరమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అవుషాపూర్కు చెందిన షేక్ జహంగీర్ వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి మంజూరు చేసుకోగా… రూ. లక్ష చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి గురువారం లబ్ధిదారుడికి అందజేశారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు.
రైతు బంధు సమితి అధ్యక్షుడి నియామకం..
పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అవుషాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ కొట్టి గోపాల్ రెడ్డిని గ్రామ శాఖ రైతు బంధు సమితి అధ్యక్షుడిగా నియమించి సన్మానించారు.
గ్రామ అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు
అవుషాపూర్ గ్రామాభివృద్ధికి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని పలువురు నాయకులు కోరగా మంత్రి స్పందించి నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా అవుషాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల బాలరాజు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి,భిక్షపతి గౌడ్, శంకర్ పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత
కీసర, డిసెంబర్ 22 : దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. జనవరి 6వ తేదీన కీసరగుట్ట ఆలయం నూతన చైర్మన్గా తటాకం కుటుంబం నుంచి రమేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి తటాకం రమేశ్శర్మ గురువారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.