కల్వకుర్తి కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి చుక్కలు చూపిస్తున్నారు. రాత్రికి రాత్రి పార్టీ కండువా కప్పుకున్న వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ రోజుకొక మండల పార్టీ కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి హెచ్చరికలు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా పలు మండలాల్లో కీలక నేతలు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తలకొండపల్లిలోనూ సుంకిరెడ్డి ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించి.. కసిరెడ్డికి టికెట్ ప్రకటన చేయగానే తాము పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని కుండబద్దలు కొట్టిచెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం వంశీచంద్రెడ్డి కూడా కడ్తాల్లో సమావేశం నిర్వహించారు. కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నా.. టికెట్ ఖరారుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)/ఆమనగల్లు
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ప్యారాచూట్ నేత రాకతో పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాత్రికి రాత్రి కండువా కప్పుకున్న వారి కోసం ఇంతకాలం కష్టపడ్డ వారిని బలి చేస్తారా? అంటూ కీలక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది, ఏడాదిన్నరగా సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండి, పార్టీకి సేవలు అందించారు. ఈ నేపథ్యంలో టికెట్ కూడా ఆయనకే వస్తుందని, నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలందరూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా కసిరెడ్డి నారాయణరెడ్డి ప్యారాచూట్ వేసుకొని కాంగ్రెస్లోకి దిగిపోవడంతో కుంపటి రాజుకున్నది. ఈ పరిణామంతో గత కొన్నిరోజులుగా నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు. ఆమనగల్లు, కల్వకుర్తి, మాడ్గుల, కడ్తాల్ మండలాల పరిధిల్లోని నేతలు, కార్యకర్తలు నిత్యం సమావేశాలు ఏర్పాటు చేసుకొని, కసిరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు.
మంగళవారం వంశీచంద్రెడ్డి ఆమనగల్లు సమీపంలో డీఎంకే ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డిని పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తాము హాజరు కావడం లేదని సోమవారం సుంకిరెడ్డి ప్రకటించడంతో కీలక నేతలెవరూ అక్కడికి వెళ్లలేదు. ముఖ్యంగా గత కొన్నిరోజులుగా సుంకిరెడ్డికి అనుకూలంగా సమావేశాలు నిర్వహించిన మండల పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ వంశీచంద్రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో కనిపించకపోవడం గమనార్హం. దీంతో వచ్చిన వారికి మాత్రమే కసిరెడ్డిని పరిచయం చేసిన వంశీచంద్రెడ్డి టికెట్ ఎవరికి వస్తుందనే అంశంపై మాత్రం పెదవి విప్పలేదు. ఒకవేళ ఆయన ఈ అంశాన్ని లేవనెత్తితే సమావేశానికి హాజరైన వారిలోనూ కొంతమంది వ్యతిరేకించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒకవైపు కీలక నేతలు, కార్యకర్తలు సమావేశానికి రాకపోవడం, వచ్చిన వారిలోనూ కసిరెడ్డికి టికెట్ అని లేవనెత్తితే నిరసన గళం వినిపించే అవకాశమున్నందున ముందు జాగ్రత్తగా ఆ అంశాన్ని లేవనెత్తలేదని తెలుస్తున్నది.
వంశీచంద్రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి అన్ని మండలాల నుంచి కొందరు నేతలు రాగా.. ఇదే సమయంలో తలకొండపల్లిలో మండల పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్పష్టమైన ప్రకటన చేశాయి. ప్యారాచూట్ నేతకు టికెట్ ఇచ్చేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇంతకాలం పార్టీకి పనిచేసిన వారికి ఎలా న్యాయం జరుగుతుంది? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కొని.. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ తమ మనోభావాలను దెబ్బతీసేలా కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం కచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైందని పార్టీ నేతలే చెబుతున్నారు.