హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. మాదాపూర్లో అత్యధికంగా 41.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో 43.4, మెదక్లో 43.2, నల్లగొండలో 41.5, రామగుండంలో 42.0, భద్రాచలంలో 41.2, హకీంపేటలో 41.0, హనుమకొండలో 41.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.