బంజారాహిల్స్ : కొవిడ్ కారణంతో ఏడాది క్రితం భార్య మృతి చెందడంతో తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న ఎస్.బాలేష్ (60) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. ఏడాది క్రితం భార్య శంకరమ్మ కరోనాతో మృతి చెందడంతో బాలేష్ మనస్థాపానికి గురయ్యాడు. అప్పటినుంచి డిప్రెషన్లో ఉండడంతో పాటు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో యాసిడ్ తాగి బాలేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు అతడిని అపోలో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాలేష్ కొడుకు వెంకటేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.