బంజారాహిల్స్, జనవరి 30: తీవ్రమైన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి చేసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేర్ ఆస్పత్రి కార్డియో థొరాసిక్ సర్జన్ డా.నగేష్ వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దినేష్ (25) కొంతకాలంగా డైలేటెడ్ కార్డియోమయోపతి (డీసీఎంపీ) అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆటోమెటిక్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ అమర్చినప్పుటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పాటు రోజరోజుకూ పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో డా.నగేష్ను సంప్రదించారు.
అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె మార్పిడి చేస్తేనే ప్రాణాలు కాపాడగలరని తేలింది. దీంతో రెండునెలల క్రితం జీవన్దాన్ ఫౌండేషన్లో దినేష్ పేరు నమోదు చేయించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరించిన కేర్ ఆస్పత్రి వైద్య బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం, దినేష్ కోలుకుంటున్నాడని డా.నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ సూపరెండెంట్ డా.అజిత్ సింగ్, సీవోవో సయ్యద్ కామ్రాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.