మేడ్చల్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 500 మందికి సబ్సిడీ రుణాలను అందించేలా లక్ష్యం పెట్టుకున్నది. ఈ మేరకు ప్రభుత్వం రూ. 6 కోట్లు కేటాయించింది. దరఖాస్తులు చేసుకున్న వారికి నెల రోజులలో సబ్సిడీ రుణాలను అందించి యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 2 లక్షల విలువ చేసే యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇచ్చి 30 శాతం బ్యాంకు రుణం అందించనుంది. ఇందులో డెయిరీఫాం, గోట్ఫాం, టైలరింగ్ షాప్, ఎంబ్రాయిడరీ మిషన్, కుట్టుమిషన్ యూనిట్లు ఉన్నాయి. ఇక మినీ సూపర్ బజార్, ఐస్క్రీమ్ పార్లర్లు, టీ స్టాల్స్, హోటల్స్ (క్యాటరింగ్) వ్యాపారాలు చేసుకునేందుకు 50 శాతం సబ్సిడీపై రూ. 10 లక్షల రుణాలను అందించనున్నారు. సంవత్సర ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న దళితులు ఈ సబ్సిడీ రుణాలకు అర్హులు.
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం..
సబ్సిడీ రుణాలు పొందేందుకు ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా 500 మందికి సబ్సిడీ రుణాలు అందించటమే లక్ష్యం. అంతకు మించి దరఖాస్తులు వచ్చినా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చదువుతో నిమిత్తం లేకుండా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డును జత పరిచి దరఖాస్తులు చేసుకోవాలి.
– బాలాజీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి
వ్యాపారాన్ని విస్తరిస్తాం
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించాను. ఈ టైలరింగ్ పనితో ఇప్పుడు నెలకు రూ. 20 వేలు వస్తున్నది. బ్యాంకు లోన్ కూడా ఇందులో నుంచే చెల్లిస్తున్నాం. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తే ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. దానికోసమే కష్టపడుతున్నాం.
– గంధం నీరజ, ప్రగతినగర్
ఆర్థికంగా నిలదొక్కుకుంటాం
ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించిన సబ్సిడీ రుణంతో వ్యాపారం చేసుకుంటున్నాం. 70 శాతం సబ్సిడీపై రూ. 2 లక్షలతో టైలరింగ్ షాప్ను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే గిరాకీ వస్తున్నది. రెడీమేడ్ వ్యాపారుల బట్టలు కుట్టేందుకు ఆర్డర్లు తీసుకుంటున్నాం. మంచిగ పని దొరికితే ఆర్థికంగా నిలదొక్కుకుంటాం.
– స్వప్న, మేడ్చల్