దేవరుప్పుల, జనవరి 5: ఎవుసం చేసుకొని బతికే కుటుంబం అది. ఆ రైతన్నకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. విధి వక్రించి అతను అనారోగ్యంతో చనిపోయారు. కానీ, ఆ కుటుంబానికి రైతు బీమా పెద్ద దిక్కుగా నిలిచింది. ఆపదలో ఆదుకున్నోళ్లను మరువం కదా. రైతు కందుకూరు అంజయ్య కూతురు వైశాలి కూడా అదే చేసింది. రైతుబీమా కింద తమ కుటుంబానికి రూ.5 లక్షలు వచ్చాయని ముగ్గు ద్వారా తెలియజెప్పింది. రైతుబంధు సంబురాల్లో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పులలో బుధవారం ముగ్గుల పోటీ నిర్వహించారు. అందులో పాల్గొన్న వైశాలి.. ‘తెలంగాణ నాడు-నేడు’ ముగ్గు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ రాక ముందు రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని, ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని ముగ్గు ద్వారా పేర్కొన్నది. ఆమె వేసిన ముగ్గు ఆలోచింపజేసేలా ఉండటంతో నిర్వాహకులు ప్రథమ బహుమతి అందజేశారు. ‘ఆత్మహత్యలు లేని తెలంగాణ జ్ఞాపకం వచ్చి ఈ ముగ్గు వేశాను. రైతుబంధు, రైతు బీమా పథకాలతో మాలాంటి కుటుంబాల జీవితాలు బాగుపడ్డాయి. మా నాయనను కోల్పోయినా, చేసిన అప్పులు తీరాయి’ అని పదో తరగతి చదువుతున్న వైశాలి చెప్పింది. రైతుబీమా పైసలతోనే కుదువపెట్టిన ఇల్లును విడిపించుకొన్నామని అంజయ్య భార్య రమణ చెప్పారు.