బన్సీలాల్పేట, డిసెంబర్ 7: కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, పాల్పడిన వారు శిక్షార్హులని హైదరాబాద్ జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి, సిటీ సివిల్ కోర్టు జడ్జి కె.మురళీమోహన్ అన్నారు. బుధవారం పద్మారావునగర్లోని సర్దార్ పటేల్ కళాశాలలో రుద్రమదేవి విమెన్స్ వెల్ఫేర్ సొసైటీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ, ఎస్పీ కళాశాల యాంటి ర్యాగింగ్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ‘ర్యాగింగ్ నిర్మూలన అవగాహన శిబిరం’ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తోటి విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేధించడంతో వారి మనోభావాలు ఎంత గాయపడతాయో అర్థం చేసుకోవాలన్నారు. రుద్రమదేవి విమెన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు, న్యాయవాది సుభాషిణి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ర్యాగింగ్ సంఘటనలు, వాటి పరిణామాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.హేమలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అమర్నాథ్ శర్మ, యాంటి ర్యాగింగ్ కమిటీ కన్వీనర్ కె.ఇంద్రాణి ప్రసంగించారు. అనంతరం ర్యాగింగ్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో విద్యార్థులు నాటక ప్రదర్శన రూపంలో వివరించారు.