సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : సిటీ పోలీసింగ్లో సీసీఎస్ అనేది ప్రధాన విభాగమని, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను పెంచుకొని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లోని సీసీఎస్ అధికారులు, జోనల్ టీమ్స్, సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టి వింగ్ అధికారులతో ఆయా విభాగాలకు సంబంధించి విధి విధానాలు, ఎలాంటి కేసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు, నేరాల ట్రెండ్స్లో మార్పు, వాటి దర్యాప్తునకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. సీసీఎస్లో ఉన్న జోనల్ టీమ్ల పనితీరు, చీటింగ్ కేసుల దర్యాప్తు, ప్రభుత్వాన్ని మోసం చేసిన చీటింగ్ కేసులు ఆయా కేసుల పురోగతి అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
సైబర్ నేరాలు పెరుగుతుండడం, సైబర్ నేరాలలో టెక్నాలజీ పెరుగుతుండడంతో నేరాల స్వభావం కూడా మారుతుందని, నేరస్థులు ఎక్కువగా ఎక్కడి నుంచి ఉంటున్నారు, బాధితులు ఎక్కువగా ఎవరుంటున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు, చార్జీషీట్లు, కోర్టులలో ఆయా కేసుల ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో అలసత్వం ఉండవద్దని, చార్జీషీట్ వేయడంలో నిర్లక్ష్యం చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయాలని, సీసీఎస్ను అప్గ్రేడ్ చేస్తూ మరో స్థాయికి తీసికెళ్లాలన్నారు.
ప్రతి కేసు దర్యాప్తు పక్కాగా ఉండాలని, నేరస్థులకు శిక్ష పడేవిధంగా దర్యాప్తు చేయాలన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు సీసీఎస్ ప్రధాన విభాగమని, ఇక్కడ పనిచేసే అధికారులు వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. మోసగాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ సీపీ(క్రైమ్స్) గజారావు భూపాల్, డీసీపీ శిల్పవల్లి, ఉమెన్ సేఫ్టి వింగ్ డీసీపీ డి.కవిత, తదితర అధికారులు పాల్గొన్నారు.