కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్) : కూకట్పల్లిలో చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. మంగళవారం కూకట్పల్లి డివిజన్లోని ఖాజాకుంట వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూకట్పల్లి పరిధిలోని ప్రధాన చెరువుల వద్ద సీవరేజ్ ప్లాంటు (ఎస్టీపీ) పనులను చేపట్టామని వెల్లడించారు.
ఎస్టీపీ పనులు పూర్తయితే చెరువులో స్వచ్ఛమైన నీరు చేరుతుందని తద్వారా చెరువు పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. చెరువు పరిసరాల్లో దుర్గంధం మాయమవుతుందని, దోమలు, ఈగల వృద్ధిని అరికట్టవచ్చన్నారు. చెరువులన్నింటిలో ఎస్టీపీలను ఏర్పాటు చేయడం, చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పనులలో జాప్యం జరుగుతుందని, అధికారులు స్పందించి త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, నాయకులు ఉన్నారు.