– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 5(నమస్తే తెలంగాణ) / సికింద్రాబాద్:ఇటు విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు – అటు సంవత్సరాల తరబడి మూసి ఉన్న రహదారులు..ఇటు ఉచిత తాగునీటి పథకం – అటు మోయలేని నీటి బిల్లులు..ఇటు మెరుగైన పారిశుధ్యం, చెరువుల సుందరీకరణ – అటు నిర్వహణ లేని డ్రైనేజీ దురవస్థ, కంపు కొట్టే డంపింగ్ యార్డు..ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత విషయాలు. చుట్టూ గ్రేటర్ హైదరాబాద్.. మధ్యలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని జనం దుస్థితి ఇది. పేరుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బోర్డు… పైగా బీజేపీ ఎంపీ, అందునా కేంద్ర మంత్రి నియోజకవర్గం. కానీ ఏండ్ల తరబడి ప్రజలకు తప్పని నిత్య నరకం. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోని విచిత్రమైన పరిస్థితి. ఇంకెన్నాళ్లీ గోస..?! అనుకున్న తరుణంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రజలకు మంచిరోజులు వచ్చే పరిణామం.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అలుపెరగని పోరాటం ఎట్టకేలకు మంచి ఫలితాన్నిచ్చింది. బోర్డు పరిధిని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేస్తే తప్ప ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదనపై కేంద్రం నుంచి కదలిక వచ్చింది. బోర్డులోని సివిల్ ఏరియాను కంటోన్మెంట్ నుంచి తొలగించి… జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పంపిన అంగీకార, నిరభ్యంతర లేఖపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయేందుకు ఎనిమిది మందితో హైపవర్ కమిటీని నియమించింది. దీంతో దాదాపు 4లక్షల మంది సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి… గ్రేటర్లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు అడుగులు పడనున్నాయి.
ఫ్లై ఓవర్లు నిర్మిద్దామంటే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రత్యేక ప్రాంతంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి సమస్యల కేంద్రంగా తయారైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండటంతో ఇక్కడ లోకల్ మిలిటరీ అధికారులదే ఆజమాయిషీ. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, పాలనా సంస్కరణల ఫలాలేవీ కంటోన్మెంట్ ప్రజలకు అందడం లేదు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలోని భూముల సేకరణ అడ్డంకిలా మారింది. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతూ, లేఖలు రాస్తున్నా… సమస్య పరిష్కారానికి కేంద్రం ముందుకు రావడం లేదు. దీంతో పలు అభివృద్ధి పనులు ప్రతిపాదనల దశలోనే ఉండిపోయాయి. వీటన్నింటికీ మించి… కంటోన్మెంట్లో 21 రహదారులను అధికారులు తరచూ మూసివేయడంతో సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరి వైపు వెళ్లే ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీనిపైనా మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు.
కలవని కేంద్ర మంత్రి లేరు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సమస్యల పరిష్కారంతో పాటు సివిల్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దీర్ఘకాలంగా పోరాడుతూనే ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రులుగా పని చేసిన అరుణ్జైట్లీ, మనోహర్ పారికర్, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్సింగ్ ఇలా ప్రతిఒక్కరినీ కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఫ్లైఓవర్లు, స్కైవేలకు సంబంధించి భూమికి బదులుగా భూమి ఇచ్చేందుకు కూడా అంగీకారం తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు అనేకమార్లు పార్లమెంటులో గళాన్ని వినిపించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశంతో ఎప్పటికప్పుడు కంటోన్మెంట్ ప్రజల సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.
బోర్డు చరిత్ర ఇది..
భారతదేశంలోని 62 కంటోన్మెంట్లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతి పెద్దది. బ్రిటిష్ పాలనలో నిజాం 13 మొఘలాయి గ్రామాలను బ్రిటిషర్లకు అప్పగించారు. అక్కడ బ్రిటిష్ సైనికులు రెజిమెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. వారంతా సాధారణ పౌరులు (సివిలియన్స్) ప్రాంతాలను ‘బజారులు’ అని నామకరణం చేసుకున్నారు. ఆ ప్రాంతాలను అప్పట్లో కంటోన్మెంట్ అని పిలిచేవారు. బ్రిటిష్ కాలం తర్వాత వాటిలో కొన్ని ప్రాంతాలు నాటి బల్దియాలో విలీనమయ్యాయి. ఆ తర్వాత కూడా కంటోన్మెంట్లో అనేక సివిల్ కాలనీలు పుట్టుకొచ్చాయి. దాంతో కంటోన్మెంట్లో పౌరుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత కాలానుగుణంగా ఆర్మీ స్థావరాలు, శిక్షణాకేంద్రాలు, క్వార్టర్లు ఇతరత్రా కార్యాలయాలు విస్తరించి ఉన్నాయి. మరో వెయ్యి ఎకరాల స్థలం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. 3 వేల ఎకరాల్లో 400కు పైగా కాలనీలు, 50కిపైగా బస్తీల్లో సాధారణ జనం (సివిలియన్) ఉన్న ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో జనాభా సుమారు నాలుగు లక్షలకు చేరుకుంది.
నెల రోజుల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా నానుతూ ఉంది. ఈ క్రమంలో ఈ విలీనంపై తమకెలాంటి అభ్యంతరం లేదని, సూత్రప్రాయ అంగీకారాన్ని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేఖ (లేఖ నెం.7884/ఎంఎ(1)/2022, తేది. 14.12.2022) రాసింది. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎంవోడీ సంయుక్త కార్యదర్శి (ఫైనాన్స్) చైర్మన్గా ఎనిమిది మందితో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ కంటోన్మెంట్ ప్రాంతంలోని భూమి, ఇతర స్థిరాస్తులను, కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు/పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, చరాస్తులు, దుకాణాలు, రహదారి నిర్వహణ, ట్రాఫిక్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, నివేదిక సమర్పించనున్నది.
పికెట్ చౌరస్తాలో సంబురాలు
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనంపై 8 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం ఎబెల్, ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్బాబు తెలిపారు. గురువారం పికెట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చుతూ సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో సంకి రవీందర్బాబు, నాయకులు మహ్మద్ ఫసి, ప్రభుత్వ గుప్తా, అంబాల శ్రీనివాస్, అరుణ్ యాదవ్, డీబీ దేవేందర్, మురళీ యాదవ్, బొట్టు ప్రభాకర్, నరసింహ, యాదగిరి, బద్దం బల్వంత రెడ్డి, మీనా భాస్కర్, గిరి, సాయికుమార్, శ్యామ్రావు, ఎంఆర్పీఎస్ నాయకులు సునీల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కమిటీ ఏర్పాటు శుభసూచికం
ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న విలీన ప్రక్రియ మళ్లీ ఊపందుకోవడం శుభసూచికం. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కేంద్రం పై అలుపెరగని పోరాటంతో కమి టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుం ది. సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని శాసనసభలోనూ ప్రస్తావించాను. హైపవర్ కమిటీని నియమిస్తూ కేంద్రం నిర్ణయం వెల్లడించడం హర్షించదగ్గ విషయం.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్
మంచిరోజులు వచ్చినట్లే
జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగ వంతం కావడంతో కంటో న్మెంట్ వాసులకు మంచి రోజులు వచ్చినట్లే. నగరం నడిబొడ్డున ఉన్నా ఆంక్షల నేపథ్యంలో ఇండ్లు నిర్మించుకోవాలన్నా, ఇతర ప్రాంతా లకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. కానీ కంటోన్మెంట్ విలీనం అయితే సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికినట్లే.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్
ఆధిపత్యానికి చరమగీతం..
వాస్తవానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు 2015లో జరిగాయి. ఈ క్రమంలో రెండేళ్లుగా కేంద్రం ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో బోర్డు ఉపాధ్యక్షుడిగా కేంద్రం నియమించిన నామినేటెడ్ సభ్యుడు అన్నీ తానై… వ్యవహరిస్తున్నారు. కేవలం బోర్డు సీఈవో, నామినేటెడ్ సభ్యుడు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలతో జనం అవస్థలు పడుతున్నారు. విలీనమైతే… ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికలతో ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు రానున్నారు.
కమిటీలోని సభ్యులు వీరే..
ఎంవోడీ సంయుక్త కార్యదర్శి (ఫైనాన్స్) – ఛైర్మన్
సభ్యులు… ఎంవోడీ జాయింట్ సెక్రటరీ (లాండ్ అండ్ వర్క్స్)
అదనపు డైరెక్టర్ జనరల్ (కంటోన్మెంట్స్)
డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్(ఎంవోడీ)
అదనపు డీజీ (ల్యాండ్ అండ్ వర్క్స్, ఎన్విరాన్ మెంట్)
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ కార్యదర్శి
కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షులు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవోలు
విలీనంతో ప్రయోజనాలు..
ఎస్ఆర్డీపీలో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ ఔటర్ రింగు రోడ్డు వరకు 18.50 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఆరు లేన్ల రహదారి నిర్మాణానికిగానూ రూ.1500 కోట్ల మేర వ్యయం అవుతుందని డీపీఆర్లో తేల్చారు. ఈ నిర్మాణం పూర్తయితే నగరం నుంచి నాగ్పూర్ హైవే నిజామాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులంతా ఔటర్ రింగు రోడ్డు సమీపం వరకు వెళ్లడం ఒక ఎత్తయితే.. అక్కడి నుంచి నగరంలోకి చేరుకోవడం కష్టసాధ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు అమలుతో నగరవాసులకు మహా ఉపశమనం లభించనుంది. దీనికి సంబంధించి భూసేకరణకు అడ్డంకి తొలగిపోతుంది.
కరీంనగర్ రాజీవ్ రహదారి నుంచి నగరంలోకి తూంకుంట రావడం ఒక ఎత్తు అయితే తూంకుంట నుంచి సికింద్రాబాద్కు రావాలంటే మరో ఎత్తు. గంటల కొద్దీ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే జింఖానా గ్రౌండ్స్ నుంచి తూంకుంట వరకు 18.400 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ఎస్ఆర్డీపీలో భాగంగా సర్కారు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు 176 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, ఇందులో ప్రైవేట్ భూములు 116 ఎకరాలు, 60.2 ఎకరాలు రక్షణ శాఖ స్థలాల సేకరించాల్సి ఉంటుంది. విలీనంతో ఈ సమస్య కూడా తీరనుంది.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 2800 ఎకరాల్లో విస్తరించిన ఉన్న 350 కాలనీలు, బస్తీల్లోని అంతర్గత రహదారులు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నాయి. దీంతో తరచూ రక్షణ శాఖ అధికారులు రహదారులను మూసివేస్తున్నారు. దీంతో తిరుమలగిరి-సఫిల్గూడ-మల్కాజిగిరి మధ్య రాకపోకలు సాధ్యం కాక… చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి. విలీనంతో సివిల్ ఏరియాలో తరచూ మూసివేత సమస్య ఎదుర్కొంటున్న 21 రహదారులు శాశ్వతంగా తెరుచుకోనున్నాయి.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కేంద్ర ఆధీనంలోని స్థానిక సంస్థ (ఎనిమిది వార్డులతో కూడిన) బోర్డు ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అనేక రూపాల్లో కల్పిస్తున్న వసతులు, అభివృద్ధి పనులు ఇక్కడ అమలు కావడం లేదు. విలీనంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతాయి.
బోర్డు పరిధిలోని నివాస ప్రాంతంలో గృహ నిర్మాణం చేపట్టాలంటే బోర్డు అనుమతి కావాలి. ఇందుకు కనీసం ఏడాది పడుతుంది. వంద గజాల లోపు స్థలాలకు అనుమతి ఉండదు. పైగా రెండంతస్తులకు మించి భవన నిర్మాణాలకు అనుమతి లేదు. విలీనంతో గ్రేటర్ పరిధిలో మాదిరిగానే 75 గజాల వరకు అసలు అనుమతి అవసరంలేదు. ఆపై టీఎస్బీపాస్ ద్వారా సులభతరంగా నిర్మాణ అనుమతులు వస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహా నగరంలో నిత్యం తాగునీటి సరఫరా జనం సంతోషంగా ఉంటే… కంటోన్మెంటు బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల్లో వారానికోసారి తాగునీరు వస్తున్న దుస్థితి. పైగా కిలో లీటరుకు రూ.13 చెల్లించాల్సి వస్తుంది. అయితే గ్రేటర్లో లెక్క తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కూడా 20వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేస్తున్నా… బోర్డు మోకాలడ్డుతుంది. విలీనంతో ఉచిత తాగునీటి పథకం సాఫీగా అమలవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం జీవో 58 ద్వారా పేదలు నివసిస్తున్న ప్రభుత్వ భూములను వారి పేరిటే క్రమబద్ధీకరణ చేయగా… బోర్డు పరిధిలోని 6 వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నా… కేంద్రం ఆధీనంలో బోర్డు ఉన్నందున ఏ ఒక్కరికీ క్రమబద్ధీకరణ చేయడం సాధ్యం కాలేదు. విలీనంతో ఈ ఫలాలు కూడా అందనున్నాయి.
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో దాదాపు 4.5లక్షల జనాభా ఉండగా… కేవలం బొల్లారంలోని ఒక్క దవాఖాన మాత్రమే శరణ్యం. విలీనంతో తెలంగాణ ప్రభుత్వం కల్పించే మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
గ్రేటర్ పరిధిలో భూములు, గృహ రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతం. కానీ ఇక్కడ 11 శాతం. అంటే ఇక్కడ 3.5 శాతం ఎక్కువ. విలీనంతో ఈ తేడా లేకుండా ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే చార్జీల అమలు ఉంటుంది.
కంటోన్మెంట్ బోర్డు ఏటా బడ్జెట్ రూ.200 కోట్లు. బోర్డులో ఉండే జనావాసాల్లోని జనాభా, అక్కడి అవసరాలు, మౌలిక వసతులకు ఇవి సరిపోవడం లేదు. బోర్డు పరిధిలో పనిచేసే 473 మంది సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వలేని దుస్థితి. రూ.650 కోట్ల మేర రావాల్సిన బకాయిలపైనా కేంద్రం స్పందించడం లేదు.
ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న తిరుమలగిరి డంపింగ్ యార్డు సమస్య తీరడంతో పాటు తిరుమలగిరి చెరువు, రామన్న కుంట సుందీకరణను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టేందుకు వీలవుతుంది.
విలీనానికి మద్దతు ఇవ్వాలి
జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్ ప్రజల్లో నానాటికీ పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కారు విలీనానికి మొగ్గుచూపుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీంతో కేంద్రం దిగొచ్చి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికైనా కమిటీ ఏకాభిప్రాయంతో విలీనానికి మద్దతుగా నివేదిక ఇవ్వాలి.
– మన్నె క్రిషాంక్, చైర్మన్,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
విలీనమైతేనే అభివృద్ధి
కంటోన్మెంట్ ప్రాంతం కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండడంతో అభివృద్ధి జరగడం లేదు. పన్ను మాత్రం జీహెచ్ఎంసీ కంటే ఎక్కువగా వసూలు చేస్తారు. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే కంటోన్మెంట్ ప్రాంతాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుంది.
– గజ్జెల నాగేశ్, చైర్మన్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్