కేపీహెచ్బీ కాలనీ, జూలై 21 : తరచుగా చెత్తవేసే ప్రాంతాలు (జీవీపీ)లను క్రమంగా తగ్గించేలా చర్యలు వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కొనడానికి ఎళ్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచి చిత్తడిగా మారిన నేపథ్యంలో ఆ ప్రాంతాలలో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చెత్తాచెదారాన్ని గమనించాలని.. జీవీపీ పాయింట్లలలో ప్రతిరోజూ చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రభలకుండా కాలనీలు, బస్తీలలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో తొలగించిన చెట్లకొమ్మలను వెంటవెంటనే తొలగించాలన్నారు.
500 మీటర్లకు.. కవర్తో కార్మికుడు..
ప్రధాన రహదారులలో 500 మీటర్లకు ఒక కార్మికుడు.. కవర్తో ఉండాలని.. రోడ్లపైన ఎవరైనా చెత్తవేస్తే గమనించి వెంటనే ఆ చెత్తను కవర్లో వేయాలని సూచించారు. కార్మికుడికి నిర్దేశించిన ప్రాంతంలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంటుందన్నారు. సర్కిల్ పరిధిలో గుర్తించిన జీవీపీ దగ్గర కార్మికుడితో పాటు రిజిష్టర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఆ జీవీపీలో చెత్త వేస్తున్న వారి వివరాలను రిజిష్టర్లో నమోదు చేయడంతో పాటు వారి ఇంటికెళ్లి అక్కడికి స్వచ్ఛ ఆటో వస్తుందా లేదా అన్న విషయాన్ని గమనించాలన్నారు. స్వచ్ఛ ఆటో అందుబాటులో లేకుంటే వెంటనే ఆ ఇంటికి స్వచ్ఛ ఆటో వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జీవీపీలలో చెత్త వేస్తున్న వారికి అవగాహన కల్పించి మరలా ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా చూడాలన్నారు.
డబుల్ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన వేగవంతం..
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలన్నారు. కూకట్పల్లి, బాలానగర్ మండలాల రెవెన్యూ అధికారులతో జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుల పరిశీలనకు మరిన్ని టీంలను సిద్ధం చేయాలన్నారు. నిర్ణీత సమయంలో దరఖాస్తులు పూర్తయ్యేలా డీసీలు ప్రత్యేక దృష్టినిసారించాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు ఎ.రమేశ్, కృష్ణయ్య, మంగతాయారు, మల్లారెడ్డి, ఏఎంహెచ్వోలు మమత, సాల్మాన్రాజు, మంజుల, జోనల్ ఏఎంసీ కె.శ్రీకాంత్రెడ్డి లు ఉన్నారు.