వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 14 : పల్లె తల్లికి సేవ చేయడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అవిరళ కృషి, ప్రణాళికలో భాగంగా మన పల్లెకు సేవచేసే భాగ్యం లభించిందని తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (టీఎస్ఐఆర్డీ) సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తన రాజకీయ జీవిత కాలంలో ఇంత ముందుచూపున్న ముఖ్యమంత్రిని చూడలేదని, ఎవ్వరూ కూడా సీఎం కేసీఆర్ దరిదాపుల్లో కనిపించబోరని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు సేవచేసే భాగ్యం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ అవార్డులతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15బృందాల ద్వారా గ్రామాల్లోని ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి మెచ్చుకున్నది తప్పా.. ఎలాంటి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీలకు అదనంగా రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సెలవు దొరికితే పల్లె బాటలో పట్నం
రాష్ట్ర ఏర్పాటుకు ముందు పల్లెల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేది. తమ పిల్లలు గ్రామానికి రావాలంటేనే కనీస సౌకర్యాలు లేని బోసిపోయిన ఊరికెందుకని బాధపడేవారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు సెలవు దొరికితే చాలు పల్లెల్లో ఉన్న అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు వస్తున్నారని చెప్పారు. పంచాయతీ రాజ్ చట్టంలో తీసుకువచ్చిన మార్పులే ఈ అవార్డులకు నిదర్శనమన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
రాష్ర్టానికి 69 అవార్డులు
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది 29, ఈ ఏడాది 40 గ్రామ పంచాయతీలకు అవార్డులను ప్రకటించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ ఎం.హన్మంత్ రావు, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఐఏఎస్ సందీఫ్ కుమార్ సుల్తానియా, సెర్ఫ్ సీఈఓ గౌతమ్, డైరెక్టర్ వెంకటేశ్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఉత్తమ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మునీరాబాద్కు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు
మేడ్చల్, సెప్టెంబర్ 14 : మేడ్చల్ మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు వచ్చింది. రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీ శిక్షణా కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నుంచి మునీరాబాద్ గ్రామ సర్పంచ్ చిటిమిల్ల గణేశ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజల సహకారం, అధికారుల సూచనలతో అవార్డును వచ్చిందని తెలిపారు.