మేడ్చల్, జనవరి27 (నమస్తే తెలంగాణ): కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపు హాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మంత్రి మల్లారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా కీసరలో జరిగే బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు మేడ్చల్ జిల్లానుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 తేదీ నుంచి 21 వ తేదీ వరకు జరుగుతాయని 18 న మహాశివరాత్రి ఉంటుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో రా నున్నందున్న రద్దీ ఎక్కువ ఉంటుందని దీని ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్వరగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తుల సౌకర్యార్థం స్వామివారిని దర్శించుకునేందుకు ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. టికెట్ ధర రూ. 2 వేలు ఉంటుందని నలుగురు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రామలింగేశ్వరస్వామికి కానుకలు సమర్పించుకునే వారు అన్లైన్ పేమెంట్, గూగుల్పే, పేటీఎమ్ ద్వారా అందజేయవచ్చన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఎలాంటి పాస్లను అనుమతించకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వస్తే తప్పకుండా వారికి సంబంధించిన గుర్తిం పు కార్డులను చూ యించిన తర్వాతే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని అన్నారు.
కీసర గుట్టలో జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జాతరకు సంబంధించి నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త వ్యవహరిస్తారని అన్నారు. రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు ఇ బ్బందు లు పడకుండా ప్రణాళికా ప్రకారం ఏర్పాట్లు చేయాలని అన్నారు. శానిటేషన్, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండాచూడాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుండా చూడాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ ఆగ్యస్త, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి, ఆలయ కమిటీ ఛైర్మన్ రమేశ్వర్మ, ఆలయ ఈవో సుధాకర్రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.