మేడ్చల్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అద్భుత విజయాలు సాధించిందని చెప్పారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని అన్నారు. టీఎస్ఐపాస్ కింద జిల్లాలో రూ.15,628 కోట్ల పెట్టుబడులతో 11,433 సూక్ష్మ చిన్న తరహా, 177 మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయని, ఫలితంగా 2,26,939 మందికి ఉపాధి లభించిందన్నారు. టీ-ఐడియా పథకం ద్వారా 3709 మంది పారిశ్రామిక వేత్తలకు రూ.1024 కోట్ల రాయితీలను అందించినట్లు తెలిపారు. టీ-ప్రైడ్ పథకంలో 2619 పారిశ్రామిక వేత్తలకు రూ.134కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సారి వానాకాలం సీజన్లో రైతుబంధు పథకం ద్వారా 35 వేల మంది రైతులకు రూ.27 కోట్ల 84 లక్షలు, రైతుబీమా ద్వారా ఇప్పటి వరకు 456 మంది రైతుల కుటుంబాలకు రూ.22 కోట్ల 80 లక్షలు అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 118 బస్తీ దవాఖానలను మంజూరు చేయగా ఇప్పటి వరకు 101 బస్తీ దవాఖానల ద్వారా వైద్య సేవలు అందుతున్నట్లు పేర్కొన్నారు. లక్షా47 వేల మంది లబ్ధిదారులకు రూ.37 కోట్ల 51 లక్షల పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
500 మందికి దళితబంధు అందించినట్లు చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా రూ.77 కోట్ల నిధులతో ఓఆర్ఆర్ వెలుపల ఉన్న 45,620 గృహాలకు నీటి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 61,842 మంది లబ్ధిదారులకు రూ.1184 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రతిభ చూపిన ఉద్యోగులకు కలెక్టర్ అమోయ్కుమార్ అవార్డులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అదేవిధంగా 285 స్వయం సహాయక సంఘాలకు రూ.22 కోట్ల 55 లక్షల నిధులను చెక్కు రూపంగా అందించగా, మెప్మా వారికి రూ.47 కోట్ల 98 లక్షల చెక్కులను అందజేశారు. అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధురాలు జనబాయిని సత్కరించిన మంత్రి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ ఆగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీసీపీ శబరీశ్, తదితరులు పాల్గొన్నారు.