ఘట్కేసర్/ఘట్కేసర్ రూరల్, జూన్ 1: నేరాలు ఛేదించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్గా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లో నూతనంగా ఏర్పాటు చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ను గురువారం హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతలే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసులకు 2014 తరువాత అత్యాధునిక సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పోలీసు యంత్రాంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆధునీకరించారన్నారు.
శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ మాడల్గా నిలుస్తుందని, పోచారంలో ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగుల భద్రత దృష్ట్యా పోలీస్స్టేషన్ను ప్రారంభించినట్లు చెప్పారు. లక్షల మందితో ఈనెల 12న ‘తెలంగాణ రన్’ కార్యక్రమాన్ని మేడ్చల్ నియోజక వర్గంలో నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ప్రజలతో స్నేహపూర్వకంగా మెదులుతూ నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేరాలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ నరేశ్ రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, ఇన్స్పెక్టర్లు అశోక్రెడ్డి, జంగయ్య, మహేందర్రెడ్డి, ప్రకాశ్ యాదవ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దయాకర్రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు రాజశేఖర్, ధనలక్ష్మి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతకు ముందు పోలీసుశాఖ ప్రత్యేక బృందం నిర్వహించిన వందన సమర్పణను మంత్రులు, అధికారులు స్వీకరించారు. పోలీస్స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన కౌన్సిలర్ ధనలక్ష్మి కాశయ్య, స్థానిక ప్రజలను మంత్రులు, పోలీసు అధికారులు అభినందించారు. అంతకు ముందు పోలీస్స్టేషన్ ఆవరణలో మంత్రులు, పోలీసు అధికారులు మొక్కలు నాటారు.
పోలీసులకు పొట్టలు ఉంటే ప్రమోషన్ ఇవ్వొద్దని మంత్రి చామకూర మల్లారెడ్డి అక్కడే ఉన్న హోం మంత్రి మహమూద్ అలీని, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. పోలీసులు శారీరంగా బలంగా ఉండాలని, అప్పుడే దొంగలు బయపడుతారని అన్నారు. ఇందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు.