హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి 542 మంది పరీక్షకు హాజరుకాగా, 467 మంది అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. ఇందులో మాలోత్ రేవంత్ 97.66, భూక్యా నవీన్ 97.28 శాతం పర్సంటైల్ పొంది తమ ప్రతిభ కనబరిచారు.
గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి 20 మంది విద్యార్థులు 90 శాతం, 63 మంది విద్యార్థులు 80 శాతం, 134 మంది విద్యార్థులు 70 శాతం పర్సంటైల్ సాధించారు. దాదాపు 150 మంది విద్యార్థులు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన గిరిజన విద్యార్థులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రోస్, అదనపు కార్యదర్శి వీ సర్వేశ్వర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
జేఈఈ మెయిన్లో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలోని జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 20 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు ఎంపిక అయ్యారు. ఇందులో వీ దీప్తి 86.81, డీ ఝాన్సీ 82.19, నిఖిత 81.90, డీ గణేశ్ 79.53, డీ శ్యామల 79.53, వీ అశ్రిత 77.57
పర్సంటైల్ సాధించారు. వీరితోపాటు మొత్తం 20 మంది విద్యార్థులు అర్హత సాధించారు. విద్యార్థులను బీసీ
సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య భట్టు
అభినందించారు.