ఆర్కేపురం, అక్టోబర్ 17 : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని గ్రీన్హిల్స్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్నదని.. దీంతో ప్రతిపక్షాలు అయోమయానికి గురవుతున్నాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. మత కలహాలు లేకుండా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో ఇతర రాష్ట్రల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చామని గుర్తు చేశారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు 1500 డబల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించామని, మరో 500 స్థానిక కోటా కింద వచ్చాయని గుర్తు చేశారు. అమరుడు సిరిపురం యాదయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి జాగా ఇచ్చి, విగ్రహం ఏర్పాటు చేసి.. క్రీడా మైదానానికి పేరు పెట్టి గౌరవించినట్లు తెలిపారు. 400 ఉన్న గ్యాస్ ధరను 1200కు పెంచి మహిళలకు వంటింటి కష్టాలు తెచ్చిన బీజేపీ నాయకులు ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. ఏటా మోదీ ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు.
సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లలో సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వివరించి.. బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, షాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెంటూరి రవీందర్రెడ్డి, మారోజు రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, గొడుగు శ్రీనివాస్, కొండ్ర శ్రీనివాస్, ముప్పిడి లింగస్వామిగౌడ్, వల్లూరి రమేశ్, రామ్నర్సింహ గౌడ్, సిద్దగోని వెంకటేశ్గౌడ్, దుబ్బాక శేఖర్, కంచర్ల శేఖర్, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్, రమేశ్ కుర్మ, నియోజకవర్గ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు పటేల్ సునీతారెడ్డి, పుష్పలతారెడ్డి, పాషా, మారం సుజాతారెడ్డి, సాజీద్, జగిని రమేశ్, మొర్రిశెట్టి శ్రీను, జగన్, మాధవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.