Azharuddin | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడట్లేవు అని పలు సర్వేల్లో తేలడంతో అధిష్టానం అనుమతి లేకుండా హడావిడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు లీకులు వదిలిన సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవిపై తెలంగాణ బీజేపీ స్పందించింది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తుంది. కానీ, ఈ రెండేళ్లలో మైనార్టీల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలనే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అజారుద్దీన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీలో దిగి.. ఓడిపోయారు. అయితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం ఓట్లను మభ్యపెట్టే విధంగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉంది. హైదరాబాద్ పరిధిలో ఎన్సిసి కోడ్ కేవలం జూబ్లీహిల్స్ పరిమితమైనప్పటికీ.. ఇది జూబ్లీహిల్స్లోని ఓటర్లను సైతం ప్రభావితం చేస్తున్నందున ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పరిగణలోకి తీసుకోవాలి అని.. ఎన్నికల అధికారులకు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.