సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ) : చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 9వ తేదీన నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, చేప ప్రసాదం పంపిణీ చేయనున్న బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు వంశపారంపర్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారని మంత్రి తలసాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ వస్తుందని చెప్పారు. కరోనా ప్రారంభం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయలేదని, మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
మృగశిర కార్తె రోజున పంపిణీ చేసే చేప ప్రసాదానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి కూడా లక్షలాది మంది వస్తుంటారని పేరొన్నారు. బత్తిన సోదరుల నివాసం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు పోలీస్ ఎసార్ట్తో ప్రసాదం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.
వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వివరించారు. అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వమే మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేస్తుందని తెలిపారు. ప్రజలు క్యూ లైన్లో వెళ్లే విధంగా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయడంతోపాటు తాగునీరు కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్లు, అంబులెన్స్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఒకటి, రెండు రోజులు ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకుంటారని, వారికి జైశ్వాల్ సమాజ్, అగర్వాల్ సమాజ్, శ్రీకృష్ణ కమిటీ, బద్రి విశాల్ పిత్తి వంటి పలు స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథంతో అల్పాహారం, భోజనం అందించే ఏర్పాట్లు చేస్తుంటారని, వారికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రహమతుల్లా బేగ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, వాటర్ వర్స్ డైరెక్టర్ కృష్ణ, సీజీఎం ప్రభు, జీఎం షరీఫ్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అబిడ్స్ ఏసీపీ పూర్ణచందర్ రావు, ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ కోటేశ్వర్రావు, ట్రాన్స్ కో సీజీఎం నరసింహ స్వామీ, ఎస్ఈ సెంట్రల్ జోన్ బ్రహ్మం, డీఈ హేమచందర్, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.