Drug Peddler Stanley | సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ స్టాన్లీ గోవా జైల్లో ఉంటూ.. అక్కడి నుంచే డ్రగ్ డీలింగ్ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల టీ నాబ్, పంజాగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్ చేసిన నైజీరియాకు చెందిన ఇవూలా ఉకోడా స్టాన్లీ నెట్వర్క్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. గోవా జైల్లో ఉన్న ఇద్దరు నిందితుల సహాయంతో నైజీరియా, ఇంగ్లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో ఉన్న డ్రగ్స్ డీలర్స్కు ఆర్డర్లు ఇచ్చి, కొరియర్ ద్వారా పుణెలోకి మత్తు పదార్థాలు తెప్పేంచే వాడన్న విషయం బయట పడింది. 2009లో బిజినెస్ వీసాపై భారత్కు వచ్చిన స్టాన్లీ.. గోవాలో నివాసిస్తుండగా అక్కడ ఉండే నైజీరియాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది.
వారి ద్వారా డ్రగ్ ట్రాన్స్పోర్టర్గా మారిన విషయం తెలిసిందే. మొదట్లో ముగ్గురు నైజీరియన్లు ఇచ్చే ఆర్డర్లను అమలు చేసిన స్టాన్లీకి, కరోనా తరువాత డ్రగ్ దందా బాగా కలిసొచ్చింది. కరోనా సందర్భంగా అప్పటి వరకు అతడికి ఆర్డర్లు ఇచ్చిన ముగ్గురు నైజీరియన్లు తమ దేశానికి వెళ్లిపోయారు. దీంతో వాళ్ల నెట్వర్క్ అంతా స్టాన్లీ చేతికి వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా 520 మంది వినియోగదారుల డేటాను సేకరించాడు. వారి ద్వారా మరింత మంది వినియోగదారులతో కూడా పరిచయాలు పెంచుకున్నాడు.
గోవా జైల్లో ఉన్న ఇద్దరి ద్వారా స్టాన్లీ విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించాడు. ఈ దందా మొత్తం వాట్సాప్ ద్వారానే నిర్వహించాడు. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ దందా కోసం స్టాన్లీ ప్రత్యేకంగా ఓ టీమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా గోవాలో ఆధార్ కార్డులు కూడా తీసుకున్నారు. కోట్ల రూపాయల విలువజేసే నాణ్యమైన కిలో కొకైన్లో.. వివిధ రకాల పదార్థాలు కలిపి నాలుగైదు కిలోలు చేస్తూ వినియోగదారులకు విక్రయించారు. గోవా జైల్లో ఉన్న నిందితులు ఫోన్లు వాడుతున్న విషయాన్ని ఇప్పటికే అక్కడి సంబంధిత అధికారులకు టీనాబ్ పోలీస్ సమాచారమిచ్చారు.
డ్రగ్ స్మగ్లర్లను తెలంగాణ వైపు చూడకుండా ఉండేలా గత కేసీఆర్ ప్రభుత్వం టీనాబ్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ పోలీసులంటే డ్రగ్ డాన్లలో వణుకు పుట్టించారు. బడా స్మగర్లను గుర్తించి అరెస్ట్ చేశారు. హైదరాబాద్, తెలంగాణ పేరు చెబితే గోవా, ముంబై, బెంగళూర్ వంటి ప్రాంతాల్లో ఉండే డ్రగ్ స్మగ్లర్లు భయపడ్డారు. అయితే, ఇటీవల ఆయా నెట్వర్కులు తిరిగి చురుకుగా మారి.. హైదరాబాద్ వైపు చూస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనల ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటి ప్రభుత్వం డ్రగ్స్పై పోరాటం చేస్తామంటున్నా.. అవి మాటల వరకే పరిమితమవుతున్నాయని, చేతల్లో చూపిస్తేనే తిరిగి ఆయా రాష్ర్టాల్లోని డ్రగ్ డాన్లకు భయం ఉంటుందని ప్రజలంటున్నారు.