యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22 : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నుంచి అలంకార సేవోత్సవాలు స్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ అలంకారాలను దర్శించినవారికి అజ్ఞానశక్తులు నశించి, జ్ఞాన శక్తులు కలిగి, శరీరం, ఆత్మ, పరమాత్మ అనే వివేక జ్ఞానం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. బ్రహోత్సవాల్లో లక్ష్మీనారసింహుడు వివిధ వాహనసేవల్లో భక్తులకు దర్శనమివ్వడం సంప్రదాయం. ఆలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా జరిగే అలంకార సేవలను వెలుపలి ప్రాకార మండపంలో ముస్తాబు చేసి ఉత్తర ద్వారం గుండా మాఢవీధుల్లో ఊరేగిస్తారు. తూర్పు ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వేంచేపు మండపంలో ఆస్థానం చేసి భక్తుల సందర్శనార్థం ఉంచి అర్చకులు వేదమంత్రాలను పఠిస్తారు.
నేడు మత్స్యావతార అలంకార సేవ
ఈ సేవను గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవితో భగవంతుడు ఆదిశేషుడిపై విహరిస్తూ తీర్థ జనానికి ఆహ్లాదాన్ని అందించే అలంకారోత్సవాలు శేషవాహనంపై రాత్రి 7 గంటలకు ఊరేగిస్తారు.
వంశపారంపర్యంగా అలంకార విద్య
అలంకార విద్య నాకు వంశపారంపర్యగా వచ్చింది. తాత శృంగారం కృష్ణమాచార్యులు అలంకరణలో సిద్ధహస్తుడు. ఆయన నుంచి నాన్న రమణాచార్యులకు, ఆయన నుంచి నాకు ఈ విద్య అబ్బింది. 18వ ఏట నుంచే స్వయంగా ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల్లో జరిగే ఉత్సవాల్లో దేవతామూర్తులకు అలంకారం చేస్తున్నాం. అవతారానికి తగ్గట్టు వస్ర్తాలు, ఆభరణాలు, ఇతర సామగ్రి నేనే తెచ్చుకుంటాను. తుదిమెరుగులు దిద్దేందుకు పుష్పాలు, దళాలు సమకూర్చాల్సి ఉంటుంది. 2023 వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే అలంకార సేవల్లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది.
-శృంగారం ఆత్రేయాచార్యులు, విగ్రహాల అలంకరణదారుడు