Hyderabad | సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ) ; గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా జీహెచ్ఎంసీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా ప్రతి ఏటా తరహాలోనే 2023లోనూ కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి.. అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది. ఎస్ఆర్డీపీతో ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులను తొలగించింది. ఎస్ఎన్డీపీతో వరద ముంపు కష్టాలు తీర్చింది. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసి.. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చింది.
ఎస్ఆర్డీపీ
2023లో ఎస్ఆర్డీపీ ద్వారా రూ.782.62 కోట్ల అంచనా వ్యయంతో 3 ఫె్లై ఓవర్లు పూర్తి చేసి..అందుబాటులోకి తెచ్చారు. ఇందులో రూ.263.09కోట్లతో కొత్తగూడ ఫె్లై ఓవర్, రూ.443.69 కోట్లతో స్టీల్ బ్రిడ్జి, ఎల్బీనగర్ జంక్షన్లో కుడి వైపు రూ.75.84 కోట్లతో ఫ్లైఓవర్లు ఉన్నాయి.
కీలకమైన ఘట్టాలివీ..
గ్రేటర్లో 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 70 వేల గృహాలు పూర్తి చేశారు. సుమారు 64 వేల ఇండ్లను నిరుపేదలకు పారదర్శకంగా పంపిణీ చేశారు.
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)లతో పలు ప్రాంతాల్లో బాక్స్ డ్రైన్లు, నాలాల విస్తరణ పనులు పూర్తికావడంతో కొన్ని కాలనీలు, బస్తీలకు వరద ముంపు నుంచి విముక్తి లభించింది. రూ. 985.45 కోట్ల అంచనా వ్యయంతో 58 పనులు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 32 పూర్తయ్యాయి. మరో 22 పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో మూడు లైన్ల రోడ్డు విస్తీర్ణం గల రోడ్డు మార్గంలో మోడల్ కారిడార్లను చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 6 మీటర్ల సర్వీస్ రోడ్డులో 1.8 మీటర్ల సైక్లింగ్ ట్రాక్, కర్బ్ రోడ్డు తో పాటు గ్రీనరీ చేపట్టేందుకు వీలుగా ఈ రోడ్డు మార్గాన్ని 19.54 కిలోమీటర్లలో రూ.52.72 కోట్లతో 16 పనులు చేపట్టారు. అందులో రూ.17.02 కోట్ల వ్యయంతో 5 పనులు పూర్తయ్యాయి. మిగతా 9 అభివృద్ధి దశలో ఉన్నాయి.
బల్దియా ద్వారా రూ.45.20 కోట్ల వ్యయంతో 12 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను పూర్తి చేశారు. 2023లో రూ.59.84 కోట్ల వ్యయంతో 14 ఫంక్షన్ హాళ్లు మంజూరవ్వగా..నిర్మాణ పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి.
రోడ్ల నిర్వహణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, కమ్యూనిటీ హాల్, కాంపౌండ్ వాల్, గ్రేవ్ యార్డ్ల నిర్మాణం కోసం రూ.2705.58 కోట్ల వ్యయంతో 9273 పనులు చేపట్టగా, అందులో రూ.695.75 వ్యయంతో ఇప్పటి వరకు 3122 పనులు పూర్తయ్యాయి.
టౌన్ ప్లానింగ్
ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్15 వరకు రూ.870.96 కోట్ల రూపాయలను బిల్డింగ్ పర్మిషన్ ద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయ రాబడి వచ్చింది. వివిధ కేటగిరీ ద్వారా టీఎస్బీపాస్ ద్వారా 57,863 గృహ నిర్మాణాల అనుమతి కోసం దరఖాస్తులు రాగా అందులో 39,869 గృహాల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. అందులో 89 లేఅవుట్ల అనుమతికి రాగా, 36 వాటికి ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
సమర్థవంతంగా నీటి సరఫరా..మురుగు శుద్ధి
కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి నిర్వహణ బాధ్యతలను జలమండలి సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ.. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు సైతం తాగునీరు అందిస్తున్నది. ఈ సారి ముఖ్యంగా రోజూ ఉత్పన్నమయ్యే మురుగును వందశాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో కొత్తగా 31 ఎస్టీపీలను నిర్మించింది. ప్రస్తుతం రెండు చోట్ల ఇవి అందుబాటులోకి రాగా..మరో 10 ప్రాంతాల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. విడతల వారీగా అందుబాటులోకి తెచ్చి 100 శాతం మురుగునీటి శుద్ధి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ను నిలిపేందుకు జలమండలి శరవేగంగా అడుగులు వేస్తున్నది.
2023లో జలమండలి కీలక ప్రాజెక్టులు..
ఓఆర్ ఆర్ ఫేజ్ – 2 ప్రాజెక్టును మొత్తం రూ.1200 కోట్ల వ్యయంతో చేపట్టగా.. కొత్తగా 73 సర్వీసు రిజర్వాయర్లు (138 మిలియన్ లీటర్ల సామర్థ్యం), 2988 కిలో మీటర్ల మేర నూతన పైపు లైను నెట్ వర్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే మొత్తం 3.6 లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం 73 రిజర్వాయర్లను నిర్మిస్తుండగా.. ఇందులో దాదాపు అన్ని తుది దశకు చేరుకున్నాయి. 23 రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 2988 కిలో మీటర్ల పైపు లైన్కు గానూ.. 2032 కిలో మీటర్ల నెట్ వర్ నిర్మాణం పూర్తయింది.
వ్యర్థాల రవాణాకు కొత్త వాహనాలు
మ్యాన్ హోళ్లను శుభ్రం చేసిన తర్వాత అందులో నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్) ఎప్పటికప్పుడు అకడి నుంచి తొలగించేందుకు జలమండలి నూతన వాహనాలను తీసుకొచ్చింది. మొత్తం 162 కొత్త వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. దీని వల్ల దాదాపు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తున్నది. అలాగే కలుషిత నీరు, లీకేజీలు అరికట్టడానికి జలమండలి క్విక్ ఇన్స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టం (క్యూఐడబ్ల్యూపీఎస్) అనే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఎస్వో ధ్రువపత్రం
హైదరాబాద్ మహానగర వాసులకు తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు జలమండలికి ఐఎస్ వో-9001:2015 ధ్రువ పత్రం మరోసారి లభించింది. ఈ ధ్రువీకరణను మరో మూడేండ్లు పొడిగిస్తున్నట్లు జియో టెక్ గ్లోబల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు.