సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు దోమల బెడద నుంచి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్యాన్ని అందించి, తద్వారా జీవన ప్రమాణాల మెరుగునకు దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మూసీ తీర ప్రాంతంతో పాటు నాలాలు, చెరువులపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. నీటి నిలువ ప్రదేశాల్లో దోమలను నియంత్రించడానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ దోమల లార్వాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా చెరువుల్లో ఉండే గుర్రపు డెకను తొలగించడం మాత్రమే సమస్యకు పరిషారం కాదు, దోమల పెరుగుదలకు ప్రధాన కారణాలైనా నీటితో నిండిన ప్రదేశాలు, వృక్షసంపద, సేంద్రియ వ్యర్థాలు ఉన్న చెరువుల్లో మన్సోనియా, అర్మిజెరిస్, క్యూలెక్స్ వంటి ఇబ్బంది కలిగించే దోమలు చెరువుల్లో సామూహిక సంతానోత్పత్తికి దోహదపడుతాయి. లార్వా దశలోనే దోమలను నియంత్రించడానికి సమర్థవంతంగా దాడి చేయడమే ప్రధానంగా డ్రోన్లను వినియోగిస్తున్నది.
డ్రోన్ల వల్ల ప్రయోజనాలు
సమయం ఆదా, ఎకరం చెరువును కేవలం 10 నిమిషాల్లో పిచికారి చేయవచ్చు. చెరువులోని అన్ని భాగాలకు సులువుగా చేరడం, చెరువు అంతటా పిచికారితో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లలో ఒకొక జోన్కు ఒకటి చొప్పున మొత్తం ఆరు హెక్సకాప్టర్ డ్రోన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 39 చెరువుల్లో పనులు పూర్తి కాగా, తాజాగా మరో 20 చెరువుల్లో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నారు.
దోమల సమస్య ఎకువగా ఉన్న చెరువులు, కుంటలు, కాలనీలు, క్వారీలు, ఓపెన్ ప్లాట్లు, డంపింగ్ యార్డు, మూసీనది పరీవాహక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాన్ని పిచికారి చేసి దోమల లార్వా, పెద్ద దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.