బంజారాహిల్స్, ఫిబ్రవరి 13 : వివిధ రకాలైన వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రేడ్లైసెన్స్ తీసుకోనివారిని గుర్తించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివిజన్ల పరిధిలో సుమారు 20వేలకు పైగా చిన్నాపెద్ద వ్యాపారాలు నడుస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో సుమారు సగం మాత్రమే ట్రేడ్ లైసెన్స్లు కలిగి ఉండడంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండి పడుతున్నది. దీంతో ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్లను క్రమం తప్పకుండా రిన్యువల్ చేసుకునేలా చూడడంతో పాటు కొత్త లైసెన్స్లు ఇచ్చేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా సర్కిల్-18 పరిధిలో 15 బృందాలు ఏర్పాటు చేశారు.
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ), ఏఎంవోహెచ్ ఈ బృందాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఈ బృందంలోని అధికారులు తమ పరిధిలోని అన్ని షాపులు, వ్యాపార సంస్థలు, హోటల్స్తో సహా అన్ని రకాలైన వాణిజ్య సముదాయాలలో తనిఖీ చేస్తూ ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయా..? లేవా..? అని ఆరా తీస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్లు తీసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది వ్యాపారాలు ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్ చేయకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు స్పెషల్ డ్రైవ్లో తేలింది. వీరిని వెంటనే ఆన్లైన్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ రిన్యువల్ చేయిస్తున్నారు. గత పదిరోజులుగా కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా సర్కిల్ -18 పరిధిలో సుమారు 3వేల ట్రేడ్లైసెన్స్లు జారీ చేశారు.
ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాల్సిందే
జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు. ఫిబ్రవరి నెలాఖరుకు అన్ని షాపులు, హోటళ్లు, ఇతర సంస్థలు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాల్సిందే. ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపార సంస్థలను సీజ్ చేస్తాం. ట్రేడ్లైసెన్స్ రెన్యువల్ చేసుకోనివారికి జరిమానా విధిస్తాం. 40 అడుగుల రోడ్డుమీద ఉన్న వ్యాపారాలకు చదరపు అడుగుకు రూ.3 చొప్పున ఫీజు చెల్లించాలి. అంతకంటే పెద్ద రోడ్లపై ఉన్న వ్యాపార సంస్థలు చదరపు అడుగుకు రూ.4 చొప్పున ఫీజు చెల్లించాలి. మీ సేవా కేంద్రాలతో పాటు నేరుగా ఆన్లైన్లో కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవచ్చు.
-రజినీకాంత్రెడ్డి, డీఎంసీ. జీహెచ్ఎంసీ సర్కిల్-18