సిటీబ్యూరో, మే 30 (నమసే తెలంగాణ) : జంట నగరాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్కు సరికొత్త అందాలు తోడవుతున్నాయి. ట్యాంక్ బండ్తో పాటు హుస్సేన్సాగర్ తీర ప్రాంతమంతా విద్యుదీపాలంకరణతో కాంతులీననుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేకంగా అలంకరణ చేపట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేస్తోంది. జూన్ 2 నుంచి 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్యాంక్బండ్తో పాటు హుస్సేన్సాగర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలను ప్రత్యేకంగా అలంకరించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
హరితహారం స్ఫూర్తిగా హుస్సేన్సాగర్ చుట్టూ గ్రీనరీని పెంపొందించామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల వారధిగా ఉన్న ట్యాంక్బండ్ సుందరీకరణకు స్వరాష్ట్రంలో సుమారు రూ.27 కోట్లతో పనులు చేపట్టారు. ముఖ్యంగా హెరిటేజ్ అర్నమెంటల్ డెకరేటివ్ పోల్స్ (క్యాస్ట్ ఐరన్) చారిత్రక శోభను తీసుకువచ్చాయి. లుంబినీ పార్కు నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా నెక్లస్ రోడ్డు వరకు రూ.9 కోట్లతో చేపట్టిన పనులు తుది దశలో ఉన్నాయి. హుస్సేన్సాగర్ జలాల్లో రూ.8 కోట్ల మ్యూజికల్ ఫౌంటేన్ను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేశారు. వీటికి తోడు నూతన సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమర వీరుల స్మారకం కూడా ఉండడంతో ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు విచ్చేస్తున్న నేపథ్యంలో అలంకరణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.