రవీంద్రభారతి,మార్చి19 : అన్ని రంగాల కంటే శక్తిమంతమైనది రాజకీయ రంగమని, అలాంటి పవిత్రమైన రాజకీయ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో 46వ కిన్నెర శ్రీశోభకృత్ నామ ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం విచ్చేసి వివిధ రంగాల్లో పనిచేసిన నిష్ణాతులకు ఉగాది పురస్కారాలను అందజేసి మాట్లాడారు.
సమాజ ఉద్ధరణ కోసం వివిధ రంగాల్లో పనిచేసిన నిష్ణాతులకు అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు. అన్ని రంగాలకంటే రాజకీయ రంగం అతిశక్తిమంతమైందని ఆ రంగం నేడు పూర్తిగా కలుషితమైందన్నారు. నోరుమెదిపితే చాలు బూతులు మాట్లాడడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ రంగాన్ని పవిత్ర రంగంగా మార్చడానికి అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహదారు డాక్టర్ కేవీ రమణాచారి, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ముద్దాళి రఘురాం తదితరులు పాల్గొన్నారు.