వాహనాల శబ్దకాలుష్యాన్ని అరికట్టేందుకు విదేశీ సాంకేతికత
అధిక మోతాదులో శబ్దాలు వచ్చే వాహనాల గుర్తింపు
త్వరలోనే సౌండ్ టెస్టింగ్ యంత్రాల ట్రయల్ రన్
సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పంజాగుట్ట చౌరస్తాలో సిగ్నల్ పడింది.. ఒక బుల్లెట్ వాహనం, ఒక కారు నుంచి నిర్ణీత ప్రమాణానికి మించిన శబ్దాలు వస్తున్నాయి. తరువాత కూడలికి వెళ్లేలోపు ఆ రెండు వాహనాల యజమానుల సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మీ వాహనం అధిక సౌండ్ ఇస్తుంది.. అందుకు తగిన జరిమానా చెల్లించి, మీ వాహనం నుంచి వస్తున్న అధిక శబ్దాన్ని తగ్గించండి. లేదంటే మీ వాహనం సీజ్ చేస్తాం’ అంటూ ట్రాఫిక్ పోలీసులను నుంచి సంక్షిప్త సందేశం వెళ్లింది. ఆ వాహనాల సైలెన్సర్లు షోరూం నుంచి వచ్చినవి కాకుండా, వాటికి మరమ్మతులు చేయించి అధిక శబ్దం వచ్చేలా తయారు చేశారు. ఇలా అధిక శబ్దాలను వెదజల్లే వాహనాలను గుర్తించేందుకు హైదరాబాద్ పోలీసులు జర్మనీ టెక్నాలజీతో కూడిన ‘సౌండ్ టెస్టింగ్’ యంత్రాలను ఉపయోగించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఎలా చేస్తుందంటే…
ఒక కూడలిలో ఏర్పాటు చేసే ఈ యంత్రం ఆ కూడలి నుంచి వెళ్లే వాహనాలన్నింటిని స్కాన్ చేస్తుంది. శబ్ద కాలుష్యానికి కారణమైన వాహనం ఫొటో తీసి, ఆ వాహనం నుంచి అధిక శబ్దం వస్తున్నట్లు ఆధారాలను రికార్డు చేస్తుంది. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు వివిధ రాష్ర్టాలు, ఇతర దేశాలలో ఉపయోగిస్తున్న పరికరాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ టెక్నాలజీ యంత్రం మంచి ఫలితాలనిస్తున్నదని గుర్తించారు. దీంతో వాటిని తెప్పించి ట్రయల్ రన్ను నిర్వహించాలని పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు
అధిక శబ్దాలు ప్రజల ఆరోగ్యాలపై ప్రభావాన్ని చూపుతాయి. మెకానిక్లు, వాహన షోరూం యజమానులు, కారు డెకర్స్, మోడిఫై చేసే దుకాణాల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అధిక శబ్దాలొచ్చే విధంగా సైలెన్సర్స్, హారన్లను మార్చవద్దని వారికి సూచిస్తున్నాం. డబ్బుకు ఆశ పడి సైలెన్సర్ల సౌండ్ పెంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జర్మనీ టెక్నాలజీతో త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తాం. ఈ పరికరాలు సమర్థవంతంగా పనిచేస్తే వాటితో ముందుకెళ్తాం, లేదంటే ఇతర దేశాలలో ఉండే పరికరాలను కూడా చూస్తాం.
– ఏవీ రంగనాథ్, జాయింట్ ట్రాఫిక్ సీపీ